E20 fuel quality: ఈ20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. రోజుకు 12 సార్లు నాణ్యత పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు వరకు కలుషితం, కల్తీకి సంబంధించిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు క్లోరైడ్ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలు మాత్రమే నమోదైనట్లు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ రెండు పెట్రోల్ బంకుల్లో వెంటనే ఇంధన విక్రయాలను నిలిపివేసి తక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
వివరాలు
ఈ20లో ఇథనాల్కు 99.6 శాతం స్వచ్ఛత తప్పనిసరి
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 వేలకుపైగా ఇంధన నమూనాలను క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితాల కోసం పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఎక్కడైనా ఇంధనంలో కలుషితం లేదా కల్తీ గుర్తిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అలాగే ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తం మీద ఓఎంసీలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిపింది.
ఈ20 పెట్రోల్లో కలిపే ఇథనాల్ తప్పనిసరిగా భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిర్దేశించిన ఐఎస్ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం పేర్కొంది.
ఇథనాల్ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండాలని, ప్రతి సరఫరాతో పాటు నాణ్యత ధ్రువీకరణ నివేదిక సమర్పించడం తప్పనిసరి అని వివరించింది.
వివరాలు
నాణ్యత లేని 302 ఇథనాల్ ట్యాంకర్లను తిరస్కరించినట్లు వెల్లడి
ఇథనాల్ నిల్వ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన కేంద్రం.. ప్రతి ట్యాంకర్ను స్వీకరించే ముందు పైభాగం, దిగువ భాగాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
అంతేకాదు, ప్రతి డెలివరీకి ముందూ నాణ్యత తనిఖీలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తున్న నేపథ్యంలో 2024 జులై నుంచి 2026 జూన్ వరకు ప్రమాణాలకు అనుగుణంగా లేని 302 ఇథనాల్ ట్యాంకర్లను తిరస్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
వాటిలో సుమారు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ ఉన్నట్లు తెలిపింది.
ఇంధన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, వినియోగదారులకు ప్రమాణాలకు అనుగుణమైన ఇంధనమే అందేలా అన్ని చర్యలు కొనసాగిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.