Loading...
Car variants: కారు కొనాలంటే కన్ఫ్యూజన్‌.. దేశంలో భారీగా పెరిగిన వేరియంట్లు!
కారు కొనాలంటే కన్ఫ్యూజన్‌.. దేశంలో భారీగా పెరిగిన వేరియంట్లు!

Car variants: కారు కొనాలంటే కన్ఫ్యూజన్‌.. దేశంలో భారీగా పెరిగిన వేరియంట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్యాసింజర్‌ వెహికల్‌ మార్కెట్‌లో కార్ల వేరియంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2021తో పోలిస్తే ప్రస్తుతం వివిధ కార్ల మోడళ్ల వేరియంట్లు ఏకంగా 56 శాతం పెరిగాయి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్‌లు, ఫీచర్లు, ధరల విషయంలో మరిన్ని ఆప్షన్లను అందించేందుకు ఆటోమొబైల్‌ సంస్థలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో ఈ కాలంలో దేశీయ మార్కెట్లో ప్యాసింజర్‌ వాహనాల వేరియంట్ల సంఖ్య 1,923కు చేరుకుంది.

వివరాలు

కొత్త మోడల్‌ కంటే వేరియంట్‌ అభివృద్ధే చౌక

కొత్త మోడల్‌ను పూర్తిగా అభివృద్ధి చేయడం కంటే ఇప్పటికే ఉన్న మోడల్‌లో కొత్త వేరియంట్లను తీసుకురావడం వేగవంతమైన, ఖర్చు తక్కువైన మార్గమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రొడక్ట్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ విభాగం హెడ్‌ అమిత్‌ ధౌండియాల్‌ తెలిపారు.

కొత్త ఫీచర్లు, అధునాతన టెక్నాలజీలను ఎప్పటికప్పుడు వేరియంట్ల రూపంలో అందించడం ద్వారా వివిధ రకాల పవర్‌ట్రెయిన్‌లు, ట్రాన్స్‌మిషన్లు, ఫీచర్లు, ధరల పరిధిలో వినియోగదారుల అవసరాలను తీర్చవచ్చని ఆయన వివరించారు.

అదే సమయంలో ఇప్పటికే ఉన్న వాహన ప్లాట్‌ఫామ్‌ల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు

వేరియంట్ల మధ్య స్పష్టమైన తేడా అవసరం

అయితే వేరియంట్ల సంఖ్య వేగంగా పెరగడం వినియోగదారులకు మరో సమస్యను తెచ్చిపెడుతోంది. ఒకే మోడల్‌లో ఉన్న వేరియంట్ల మధ్య తేడాలను అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.

వేరియంట్లలో ఫీచర్లు ఎక్కువగా ఒకదానితో ఒకటి పోలి ఉంటే కొనుగోలు నిర్ణయం మరింత సంక్లిష్టంగా మారుతుందని అమిత్‌ ధౌండియాల్‌ అన్నారు.

అందుకే ప్రతి వేరియంట్‌కు స్పష్టమైన ప్రత్యేకత ఉండాలని, వాటిని సులభంగా అర్థం చేసుకునేలా సరళమైన, క్రమబద్ధమైన వేరియంట్‌ హైరార్కీని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వినియోగదారులు తమకు కావాల్సిన పవర్‌ట్రెయిన్‌, ట్రాన్స్‌మిషన్‌, ఫీచర్లు, ధరలను కలిపి సరైన కాంబినేషన్‌ కోసం చూస్తున్నారని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఆప్షన్లు పెరిగినా.. నిర్ణయం తీసుకోవడం కష్టం

జాటో డైనమిక్స్‌ ప్రెసిడెంట్‌ రవి భాటియా మాట్లాడుతూ.. కారును కొనుగోలు చేయడం గతంతో పోలిస్తే సులభంగా మారినా, సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం మాత్రం మరింత సంక్లిష్టంగా మారిందని అన్నారు.

ఎక్కువ ఆప్షన్లు, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం వల్ల కారు గురించి తెలుసుకోవడం సులభమైందని.. అయితే చివరకు ఏ వేరియంట్‌ను ఎంచుకోవాలనే విషయంలో వినియోగదారులు తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు.

అదనంగా రూ.50,000లేదా రూ.1 లక్ష చెల్లిస్తే ఏ అదనపు ఫీచర్లు లభిస్తాయో అర్థం చేసుకోవడమే కీలక నిర్ణయంగా మారిందని వివరించారు.

భవిష్యత్తులో ఆటోమొబైల్‌ కంపెనీలు కొత్త మోడళ్లతో మాత్రమే కాకుండా.. ఒక్కో మోడల్‌ను వివిధ రకాల కొనుగోలుదారులకు ఎంత కచ్చితంగా సరిపోయేలా రూపొందించగలవనే అంశంపైనా పోటీ పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు

షోరూమ్‌కు వచ్చేవారికి ముందే అవగాహన

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) వైస్‌ ప్రెసిడెంట్‌ సాయి గిరిధర్‌ ప్రకారం.. ప్రస్తుతం కస్టమర్లు షోరూమ్‌లకు వచ్చే సమయానికి కార్ల గురించి ముందుగానే బాగా పరిశోధన చేసి వస్తున్నారు.

అయినప్పటికీ అధిక సంఖ్యలో వేరియంట్లు ఉండటంతో చివరి నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

సాధారణంగా వినియోగదారులు ముందుగా ఒక బ్రాండ్‌ను, అలాగే తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఒక ధరల పరిధిని నిర్ణయించుకుంటారని.. ఆ తర్వాత డీలర్‌ ఆ పరిధిలో అందుబాటులో ఉన్న వివిధ వేరియంట్ల మధ్య తేడాలను వివరించి సరైన ఎంపిక చేసుకునేందుకు సహాయపడతారని ఆయన తెలిపారు.

ADVERTISEMENT