Nitin Gadkari: భవిష్యత్తులో ఢిల్లీ బస్సులకు చెత్తతో తయారయ్యే హైడ్రోజన్ ఇంధనం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థలో త్వరలోనే మరో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశముందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భవిష్యత్తులో ఢిల్లీ నగర బస్సులు చెత్త నుంచి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఇందుకోసం నగరంలోని మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో వేరు చేసి, వాటి ద్వారా హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన యువజన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
టయోటా మిరాయ్ కార్ను వినియోగిస్తున్న మంత్రి..
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, "ఇది ఎలా సాధ్యమవుతుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే గత యాభై సంవత్సరాల్లో నేను ముందుగా చెప్పిన విషయాల్లో నెరవేరనిది ఏదైనా ఉందా?" అని వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న ఆయన, ముఖ్యంగా హైడ్రోజన్ ఆధారిత వాహనాలపై ఎప్పటి నుంచో ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేసే టయోటా మిరాయ్ కార్ను స్వయంగా వినియోగిస్తున్న నేతగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
వివరాలు
బయోడైజెస్టర్ల సహాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి..
ప్రస్తుతం ఢిల్లీలో ఇప్పటికే ఒక హైడ్రోజన్ ఆధారిత బస్సు సేవలు అందిస్తోంది. ఈ బస్సు సెంట్రల్ విస్టా ప్రాంతంలో సుమారు 180 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ బస్సుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని ఫరీదాబాద్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన హైడ్రోజన్ స్టేషన్ నుంచి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో, నిరంతర హైడ్రోజన్ సరఫరా ప్రధాన సవాలుగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు. చెత్త నిర్వహణపై మాట్లాడుతూ, నగరంలోని ఘన వ్యర్థాలను వేరు చేసి బయోడైజెస్టర్ల సహాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయవచ్చని ఆయన వివరించారు.
వివరాలు
ఆ దిశగా ప్రభుత్వం చర్యలు..
"ఈ ప్రక్రియ ద్వారా తయారయ్యే హైడ్రోజన్తో ఢిల్లీ బస్సులు నడపడం పూర్తిగా సాధ్యమే" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక అమలైతే నగరంలో పేరుకుపోయిన చెత్త సమస్యకు కూడా గణనీయమైన పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఢిల్లీలోని ల్యాండ్ఫిల్ ప్రాంతాల్లో పేరుకుపోయిన సుమారు 80 లక్షల టన్నుల చెత్తను ఎక్స్ప్రెస్వేల నిర్మాణ పనుల్లో వినియోగించినట్లు గడ్కరీ తెలిపారు. వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.
వివరాలు
ఆదాయ వనరులు పెంచుకునే దిశగా చర్యలు..
వ్యర్థాల నిర్వహణ ఆర్థికపరంగా కూడా ప్రయోజనకరమని గడ్కరీ వివరించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ శుద్ధి చేసిన మురుగునీటిని విక్రయించడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.325 కోట్ల ఆదాయం పొందుతోందని ఆయన వెల్లడించారు. సరైన వ్యర్థ నిర్వహణతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయ వనరులను కూడా పెంచుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.