E85,E100 ethanol Blend: త్వరలోనే E85,E100 ఇథనాల్ మిశ్రమాలతో నడిచే కారు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989లో మార్పులు చేస్తూ, ఎక్కువ శాతం ఎథనాల్ కలిపిన ఇంధనాలను అధికారికంగా ప్రవేశపెట్టేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 27న విడుదలైన ఈ ప్రతిపాదనలో 85% ఎథనాల్ కలిగిన E85, పూర్తిగా ఎథనాల్తో నడిచే E100ఇంధనాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇకపై పెట్రోల్ వాహనాల ఇంధన వర్గీకరణను E10 నుంచి E20గా మార్చనున్నారు. హైడ్రోజన్ వాహనాలకు "Hydrogen+CN" స్థానంలో "Hydrogen+CNG"గా పేరు మారుతుంది.
వివరాలు
త్వరలోనే 100% ఎథనాల్ మిశ్రమం లక్ష్యం
బయోడీజిల్ విషయంలో కూడా B10 నుంచి B100 (100% బయోడీజిల్)వరకు నవీకరణలు ప్రతిపాదించారు. ఈ డ్రాఫ్ట్పై ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. 2025 నాటికి 20% ఎథనాల్ మిశ్రమ లక్ష్యం సాధించిన భారత్.. ఇక దిగుమతుల తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశం త్వరలోనే 100% ఎథనాల్ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వెస్ట్ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన స్వయం సమృద్ధి అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విమాన ఇంధనమైన ATFలో కూడా ఎథనాల్, సింథటిక్ హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని అనుమతిస్తూ కేంద్రం మార్పులు చేసింది. అయితే ప్రస్తుతం తప్పనిసరి లక్ష్యాలు మాత్రం నిర్ణయించలేదు.