Bharat Taxi: వర్షం,ట్రాఫిక్ ఉన్నా ఛార్జీ మారదు.. భారత్ టాక్సీ ప్రత్యేకత ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
సిటీ ప్రయాణికులకు శుభవార్త. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసుల అధిక ఛార్జీలతో విసిగిపోయిన వారికి ఊరట కలిగించే అప్డేట్ ఇది. ఇక ఆందోళన అక్కర్లేదు. జనవరి 1 నుంచి ప్రభుత్వం తీసుకువస్తున్న భారత్ టాక్సీ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా నగరాల్లో క్యాబ్ బుకింగ్ మరింత సులభంగా, వేగంగా జరగనుంది. ముఖ్యంగా ఛార్జీలు సామాన్యుల బడ్జెట్కు అనుగుణంగానే ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఓలా, ఉబర్ క్యాబ్లలో డ్రైవర్లు ప్రయాణం ఎక్కడికి అని అడిగి, తక్కువ ఛార్జీ ఉంటే రైడ్ను రద్దు చేయడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. వర్షాలు, ఆఫీస్ టైమింగ్స్ లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఛార్జీలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి.
వివరాలు
జనవరి 1, 2026 నుంచి ఢిల్లీలో కొత్త వ్యవస్థ అమల్లోకి..
మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారైతే ఇకపై ఆందోళన అవసరం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా ఢిల్లీలో కొత్త వ్యవస్థ అమల్లోకి రాబోతోంది. జనవరి 1, 2026 నుంచి దేశ రాజధానిలో భారత్ టాక్సీ యాప్ను ప్రారంభించనున్నారు. ఇది కూడా ఓలా, ఉబర్ లాగే మొబైల్ యాప్ ఆధారిత క్యాబ్ బుకింగ్ సేవ. ఈ ప్రభుత్వ యాప్ను మీ ఫోన్లో సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి భారత్ టాక్సీకి ఓలా, ఉబర్లకు మధ్య ఉన్న తేడాలు ఏంటి? ఛార్జీలు, ఫీచర్ల పరంగా ఈ యాప్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
1. భారత్ టాక్సీలో ఛార్జీల మోసాలు ఉండవు :
ఓలా,ఉబర్ యాప్లు డిమాండ్ పెరిగితే వెంటనే ఛార్జీలను రెట్టింపు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నపాటి వర్షం పడినా రూ.100 ప్రయాణం రూ.300 వరకు పెరగడం సాధారణమైంది. ఈ విధానాన్ని కంపెనీలు డైనమిక్ ప్రైసింగ్ అని చెబుతాయి. కానీ, దీనివల్ల ప్రయాణికులపై భారీ ఆర్థిక భారం పడుతోంది. భారత్ టాక్సీలో ఈ సమస్య ఉండదు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ యాప్లో ఛార్జీలు ముందుగానే ఖరారు చేస్తారు. రద్దీ సమయాల్లో అయినా, రాత్రి వేళల్లో అయినా, మీరు బుకింగ్ సమయంలో చూపించిన ఛార్జీనే చెల్లించాలి. ప్రయాణం ముగిసే సమయానికి అనవసరంగా పెరిగిన బిల్లు అనే సమస్య ఉండదు. వర్షం, ట్రాఫిక్ లేదా పీక్ అవర్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ ఫీజు విధానంతో ఈ యాప్ పనిచేస్తుంది.
వివరాలు
2. డ్రైవర్లకు ఆదాయం, రైడ్ క్యాన్సిల్ చేయరు :
ప్రైవేట్ క్యాబ్ యాప్లలో డ్రైవర్లకు వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో చాలామంది రైడ్లను రద్దు చేస్తుంటారు. ఎందుకంటే ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు ఛార్జీలలో 20 నుంచి 25 శాతం వరకు, కొన్నిసార్లు 30 శాతం వరకు కమీషన్గా కట్ చేస్తాయి. భారత్ టాక్సీ మోడల్లో మాత్రం 80 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా డ్రైవర్కే అందిస్తారు. దీంతో డ్రైవర్లు తమ సంపూర్ణ ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ కారణంగా రైడ్ క్యాన్సిల్ చేసే పరిస్థితులు తగ్గి, ప్రయాణాన్ని పూర్తి చేయడానికే డ్రైవర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
వివరాలు
3. సింగిల్ యాప్తో అన్ని రైడ్స్ :
కొన్ని సందర్భాల్లో మనకు ఆటో మాత్రమే అవసరం ఉంటుంది. కానీ చాలా యాప్లు ఖరీదైన కార్లనే చూపిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో బైక్, టాక్సీ కావాల్సి రావచ్చు. భారత్ టాక్సీ ఈ సమస్యకూ పరిష్కారం చూపిస్తోంది. ఈ యాప్ సూపర్ అగ్రిగేటర్గా పనిచేస్తుంది. జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలు, కార్లు - అన్ని రకాల వాహనాలను ఒక్కే స్క్రీన్పై ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 56 వేల మంది డ్రైవర్లు భారత్ టాక్సీలో నమోదు అయ్యారు. దీంతో వాహనం కోసం వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.
వివరాలు
4. హిడెన్ ఛార్జీలు ఉండవు :
ప్రైవేట్ యాప్లలో బుకింగ్ ఫీజులు, వెయిటింగ్ ఛార్జీలు అంటూ చివరికి బిల్లు పెరుగుతుంది. కానీ భారత్ టాక్సీలో అలాంటి హిడెన్ ఛార్జీలకు అవకాశం లేదు. లాభం కోసం కాకుండా ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పూర్తిగా పారదర్శకంగా నిర్ణయిస్తారు. యాప్లో చూపించిన మొత్తమే ఫైనల్ బిల్లు. అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
5. ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం
ప్రైవేట్ క్యాబ్ కంపెనీల కస్టమర్ కేర్పై చాలామందికి అసంతృప్తి ఉంటుంది. రీఫండ్లు లేదా ఫిర్యాదుల కోసం పదేపదే ఇమెయిల్స్ పంపాల్సి వస్తుంది. భారత్ టాక్సీ విషయంలో మాత్రం ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం వల్ల ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా, వేగంగా పరిష్కారం లభించే అవకాశం ఎక్కువ. ఇది డ్రైవర్లకే కాదు, ప్రయాణికులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.