Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్బై.. 100% ఇథనాల్తో దూసుకొచ్చిన టొయోటా ఫార్చ్యూనర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియా మోటార్ షో 2026 వేదికగా ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టొయోటా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్చ్యూనర్ ఎస్యూవీకి చెందిన రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో ఒకటి 100 శాతం బయో ఇథనాల్ (E100) ఫ్లెక్స్-ఫ్యూయల్తో నడిచే వెర్షన్ కాగా, మరొకటి B50 బయోడీజిల్ ఆధారిత మోడల్. ఈ రెండు వాహనాలు ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికత అభివృద్ధిపై టొయోటా దృష్టిని ఇవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
వివరాలు
100 శాతం బయో ఇథనాల్తో నడిచే ఫార్చ్యూనర్
ఫ్లెక్స్-ఫ్యూయల్ (E100) ఫార్చ్యూనర్లో బాహ్య డిజైన్, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రధాన మార్పులన్నీ ఇంజిన్, ఇంధన వ్యవస్థలోనే ఉన్నాయి.
100 శాతం బయో ఇథనాల్ను వినియోగించేందుకు ప్రత్యేకంగా కొత్త ఫ్యూయల్ లైన్లు, హోస్ పైప్లు, ఇంజిన్ హెడ్తో పాటు పలు మెకానికల్ భాగాలను అమర్చారు.
ఈ మోడల్లో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 161 bhp పవర్, 243 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రియర్-వీల్ డ్రైవ్ (RWD) లేఅవుట్తో ఈ కాన్సెప్ట్ను రూపొందించారు.
నిజానికి ఫ్లెక్స్-ఫ్యూయల్ ఫార్చ్యూనర్ కాన్సెప్ట్ను టొయోటా మూడేళ్ల క్రితమే ప్రదర్శించింది. అయితే ఇప్పటికీ ఇది భారీ స్థాయి ఉత్పత్తి లేదా మార్కెట్ విక్రయాలకు సిద్ధంగా లేదు.
వివరాలు
B50 బయోడీజిల్కు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ
టొయోటా మరోవైపు B50 బయోడీజిల్ ఫార్చ్యూనర్ కాన్సెప్ట్ను కూడా ప్రదర్శించింది. ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్నే కొనసాగించారు.
ఈ ఇంజిన్ 201 bhp పవర్, 500 Nm టార్క్ అందిస్తుంది. ఈ వెర్షన్లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్తో పాటు 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ను జత చేశారు.
దీని వల్ల ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు వాహనం విడుదల చేసే కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.
వివరాలు
భారత్లోకి వచ్చే అవకాశాలు
భారత్లో ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీకి మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ రెండు ఫార్చ్యూనర్ మోడళ్లు పరీక్షల దశలో ఉన్నాయి.
అయితే రాబోయే నెలల్లో ఈ టెక్నాలజీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అంశంపై టొయోటా పరిశీలించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
అదే జరిగితే, 100 శాతం బయో ఇథనాల్ లేదా బయోడీజిల్తో నడిచే భారత తొలి ప్రీమియం ఎస్యూవీగా ఫార్చ్యూనర్ కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
వివరాలు
2026 హైలక్స్ను కూడా విడుదల చేసిన టొయోటా
ఇదిలా ఉండగా, టొయోటా ఇటీవల 2026 Toyota Hilux పికప్ ట్రక్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 9వ తరం హైలక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.31.99 లక్షలుగా నిర్ణయించారు.
కొత్త హైలక్స్లో ఫ్రంట్ డిజైన్ను మరింత బోల్డ్, రగ్గడ్ లుక్తో తీర్చిదిద్దారు.
అయితే మెకానికల్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి 2.8-లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్నే కొనసాగించారు.
ఇది 204 hp పవర్, 500 Nm టార్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను జత చేశారు.
ఈ పికప్ ట్రక్ 4×2, 4×4 డ్రైవ్ట్రెయిన్ ఎంపికల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.