
Two wheelers: జూలై 15 నుండి భారత రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. త్వరలో ప్రకటన..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటి వరకూ జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ చెల్లింపులో మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. కానీ, త్వరలోనే ఈ నిబంధనలో మార్పు చోటుచేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఇకపై టూవీలర్ వాహనదారులు కూడా టోల్ చెల్లించాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలపై కూడా టోల్ ఫీజు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సంబంధిత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇప్పటివరకూ జాతీయ రహదారులపై టోల్ ఫీజు విధానం ప్రధానంగా ఫోర్వీలర్లు, ఇతర భారీ వాహనాలపై మాత్రమే అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు,ఆటో రిక్షాలు ఎలాంటి టోల్ చెల్లింపు లేకుండానే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నాయి.
వివరాలు
ద్విచక్ర వాహనదారుల నుంచి గట్టి వ్యతిరేకత
అయితే, ఈ సౌలభ్యం ఇకపై కొనసాగకపోవచ్చని సమాచారం. జూలై 15వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలపై కూడా టోల్ వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైతే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ద్విచక్ర వాహనదారుల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.