Postal Jobs: తపాలాశాఖలో 28వేల ఉద్యోగాలు.. తొలి మెరిట్ జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ జనవరిలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026లో భాగంగా మొత్తం 28,636 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపికైన వారి తొలి జాబితాలను తపాలా శాఖ అధికారులు రాష్ట్రాల వారీగా తమ అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 1,060 పోస్టులు, తెలంగాణ నుంచి 608 పోస్టులు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన మొదటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 1,048 మంది, తెలంగాణ నుంచి 607 మంది అభ్యర్థులు షార్ట్లిస్ట్ అయినట్లు వెల్లడించారు.
Details
ధ్రువపత్రాల పరిశీలనకు హజరు కావాలి
ఈ తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మార్చి 23లోగా తమకు సంబంధించిన డివిజనల్ కార్యాలయాల్లో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటోకాపీలను కూడా వెంట తీసుకురావాలని తపాలా శాఖ అధికారులు సూచించారు. అభ్యర్థుల ఎంపికను పదో తరగతిలో పొందిన మార్కులు లేదా గ్రేడ్ల మెరిట్ ఆధారంగా చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ విధానంలో మార్కుల ప్రాధాన్యం, అలాగే రిజర్వేషన్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లేదా పోస్టు ద్వారా అందజేయనున్నారు. ఈ నియామకాలలో ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.