LOADING...
8th pay commission: 8వ వేతన సంఘం పేరుతో భారీ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్!
8వ వేతన సంఘం పేరుతో భారీ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్!

8th pay commission: 8వ వేతన సంఘం పేరుతో భారీ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కొత్త సైబర్ మోసం బయటపడింది. 8వ వేతన సంఘం పేరిట భారీ జీత పెంపు లెక్కలు చెబుతామని చెప్పి నకిలీ APK ఫైళ్లతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Indian Cyber Crime Coordination Centre (I4C) విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం, ముఖ్యంగా వాట్సాప్ ద్వారా "మీ రివైజ్డ్ జీతం తెలుసుకోండి" అంటూ మెసేజ్‌లు పంపి APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని కోరుతున్నారు. APK అంటే ఆండ్రాయిడ్ యాప్ ప్యాకేజ్ ఫైల్. ఇది సాధారణ సాలరీ కాల్కులేటర్‌లా కనిపించినా, లోపల మాల్వేర్ దాగి ఉంటుంది.

వివరాలు 

నకిలీ APKలపై అలర్ట్.. అధికారిక వెబ్‌సైట్లనే నమ్మండి!

ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్‌పై మోసగాళ్లకు రిమోట్ యాక్సెస్ లభించి,మెసేజ్‌లు చదవడం,OTPలు సొంతం చేసుకోవడం,బ్యాంక్ ఖాతాలకు చేరుకోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయని ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ఎక్తా రాయ్ హెచ్చరించారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన నిజమైన సమాచారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక పోర్టల్ 8cpc.gov.in లేదా verified.gov.in డొమైన్‌లనే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని, 'ఇన్‌స్టాల్ ఫ్రమ్ అన్‌నోన్ సోర్సెస్' ఆప్షన్‌ను డిసేబుల్‌లో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. OTPలు,వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు ఎదురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

వివరాలు 

FASTag రీఛార్జ్ పేరుతో కొత్త మోసం.. NHAI,I4C అత్యవసర హెచ్చరిక

ఇదే తరహాలో FASTag పేరుతో కూడా మోసాలు పెరుగుతున్నాయని I4C తెలిపింది. రీఛార్జ్, యాక్టివేషన్, రీఫండ్ పేరుతో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు గూగుల్‌లో ప్రచారం చేసి, స్క్రీన్ షేరింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించింది. National Highways Authority of India (NHAI) కూడా FASTag సేవల కోసం అధికారిక, ధృవీకరించిన ప్లాట్‌ఫారమ్‌లనే వినియోగించాలని, స్పాన్సర్డ్ లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. వార్షిక పాస్ కొనుగోలు కోసం Rajmargyatra యాప్ ఒక్కటే అధికృత వేదిక అని స్పష్టం చేసింది.

Advertisement