Andhra Pradesh: విశాఖపట్టణంలో యాక్సెంచర్ కొత్త క్యాంపస్.. 12 వేల ఉద్యోగాలకు కల్పించేందుకు సిద్దమైన కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో తమ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి మరో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం యాక్సెంచర్ ముందుకొచ్చింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదనలు సమర్పించినట్టు రాయిటర్స్ నివేదించింది. మొత్తం 12 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమని ప్రకటించిన యాక్సెంచర్, దీనికోసం 10 ఎకరాల భూసముదాయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా భూమి కేటాయించాలని కూడా కోరింది.
వివరాలు
యాక్సెంచర్ ను విశాఖకు రప్పించేందుకు ప్రభుత్వం ఆసక్తి
యాక్సెంచర్ నుంచి వచ్చిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఆ సంస్థను విశాఖకు రప్పించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని తెలిసింది. గతంలో ఇతర ఐటీ సంస్థలకు ఇచ్చిన రాయితీలను మాత్రమే యాక్సెంచర్ కూడా కోరుతోందని, ఎలాంటి అసాధారణమైన కోరికలేమీ కోరడం లేదని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశముందని భావిస్తున్నారు. విశాఖను ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది.
వివరాలు
విశాఖలో తమ ప్రాజెక్ట్ పనులను మొదలుపెట్టనున్న కాగ్నిజెంట్
ఇప్పటికే టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గూగుల్ వచ్చే నెలలో ఒప్పందం చేసుకుని డేటా సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. కాగ్నిజెంట్ కూడా విశాఖలో తమ ప్రాజెక్ట్ పనులను మొదలుపెట్టనుంది. ఇప్పుడు యాక్సెంచర్ రావడంతో, భవిష్యత్తులో భారతదేశంలో కొత్త క్యాంపస్లను ఏర్పాటు చేయాలని భావించే ఐటీ కంపెనీలకు విశాఖపట్నమే ప్రధాన కేంద్రంగా మారనుందనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది.