Loading...
Adani: అదానీ ఎయిర్‌లైన్స్‌కు రంగం సిద్ధం?.. కేంద్రం విధాన మార్పుపై కసరత్తు
అదానీ ఎయిర్‌లైన్స్‌కు రంగం సిద్ధం?.. కేంద్రం విధాన మార్పుపై కసరత్తు

Adani: అదానీ ఎయిర్‌లైన్స్‌కు రంగం సిద్ధం?.. కేంద్రం విధాన మార్పుపై కసరత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ కీలక ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థలు ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండకూడదనే నిబంధనను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదానీ గ్రూప్ కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ సొంత విమానయాన సంస్థను ప్రారంభించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో, ఎయిర్ ఇండియాలకు కొత్త పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

దేశీయ ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉన్న ఇండిగో,ఎయిర్ ఇండియా

దేశీయ విమానయాన రంగంలో పోటీని పెంచేందుకు ప్రధాన విమానాశ్రయాల నిర్వాహక సంస్థలకు కూడా ఎయిర్‌లైన్లు నిర్వహించే అవకాశం కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఇటీవల సంకేతాలు వెలువడ్డాయి.

ప్రస్తుతం ఇండిగో,ఎయిర్ ఇండియా కలిసి దేశీయ ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈ పరిస్థితిలో కొత్త సంస్థల ప్రవేశం వల్ల పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2006లో ఢిల్లీ,ముంబై విమానాశ్రయాల ప్రైవేటీకరణ సమయంలో ఒప్పందాల్లో చేర్చిన పరిమితి నిబంధనను సవరించాలని అదానీ గ్రూప్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

వివరాలు 

దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణ

ఈ నిబంధనను గత తేదీ నుంచి అమలు అయ్యేలా సవరించే అవకాశం ఉందా అనే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుంచి న్యాయ సలహా కోరుతోంది.

నిబంధనల్లో మార్పులకు చివరికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరం.

ఇప్పటికే అదానీ గ్రూప్ విమానయాన రంగంలో తన ఉనికిని విస్తరించింది.

దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణతో పాటు పైలట్ శిక్షణ కేంద్రాలు, విమానాల మరమ్మతు, నిర్వహణ (ఎంఆర్ఓ) సదుపాయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను కూడా నిర్వహిస్తోంది.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌కు 74 శాతం నియంత్రణ వాటా ఉండగా, ఢిల్లీ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఆధీనంలో ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎంబ్రాయర్‌తో కలిసి భారత్‌లో విమానాల తయారీ చేపట్టాలనే యోచన

బ్రెజిల్‌కు చెందిన విమానతయారీ సంస్థ ఎంబ్రాయర్‌తో కలిసి భారత్‌లో విమానాల తయారీ చేపట్టాలనే యోచన కూడా అదానీ గ్రూప్‌కు ఉంది.

అయితే ఇప్పటికే ఉన్న భారతీయ ఎయిర్‌లైన్ల నుంచి ఎంబ్రాయర్ విమానాలకు పెద్దగా ఆర్డర్లు రాకపోవడంతో,సొంత ఎయిర్‌లైన్‌ను ప్రారంభించడం ద్వారా తయారీ ప్రాజెక్టుకు బలం చేకూరుతుందని సంస్థ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

సొంత ఎయిర్‌లైన్ ఉంటే కార్యకలాపాల్లో అనేకప్రయోజనాలు ఉంటాయని అదానీ గ్రూప్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ఏ ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసే చర్చలు లేవని,తుది నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం వద్ద చేసిన విజ్ఞప్తి కేవలం యాజమాన్య పరిమితులు లేకుండా భవిష్యత్తుకు అనుకూలమైన విధానాన్ని రూపొందించాలనే ఉద్దేశంతోనేనని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

కఠినమైన భద్రతా నిబంధనలు తీసుకురావాలని కేంద్రం యోచన 

మరోవైపు, దేశీయ విమానయాన రంగంలో పోటీ పెరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఉన్న ఎయిర్‌లైన్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలే ఎయిర్‌లైన్లను కూడా నడిపితే టేకాఫ్, ల్యాండింగ్ స్లాట్ల కేటాయింపులో ప్రయోజనాల ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే అలాంటి సమస్యలు తలెత్తకుండా కఠినమైన భద్రతా నిబంధనలు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్ల మధ్య వాణిజ్యపరమైన సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడాన్ని నిషేధించడం, కీలక అధికారులను రెండు సంస్థల్లో ఒకేసారి నియమించకుండా చూడటం వంటి నిబంధనలను అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT