Anil Ambani: విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకుంటా: సుప్రీంకోర్టుకు అనిల్ అంబానీ హామీ
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani) దేశం విడిచి వెళ్లే ముందు కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG)కు సంబంధించిన సుమారు రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసుల్లో జరుగుతున్న దర్యాప్తుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేసుల్లో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావిస్తూ, దర్యాప్తు వేగవంతంగా, నిష్పాక్షికంగా జరగాలని కోరుతూ మాజీ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)కు ప్రతిస్పందనగా అనిల్ అంబానీ అఫిడవిట్ సమర్పించారు.
వివరాలు
చట్ట ప్రక్రియ నుంచి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు: అనిల్
గత ఏడాది జూలై నుంచి ఈ కేసుల దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి తాను దేశం విడిచి వెళ్లలేదని తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లాలనే ఆలోచన లేదా ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏదైనా కారణంగా విదేశాలకు వెళ్లాల్సి వస్తే, ముందుగా కోర్టు అనుమతి తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంబంధిత కేసుల దర్యాప్తు సంస్థలకు పూర్తిగా, నిజాయతీతో సహకరిస్తున్నానని, అదే విధంగా కొనసాగిస్తానని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియను తప్పించుకునే ఉద్దేశం తనకు లేదని, అలాంటి చర్యలకు తాను పాల్పడనని కూడా పేర్కొన్నారు.
వివరాలు
దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐ,ఈడీకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీం
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న హాజరు కావాలని Enforcement Directorate సమన్లు జారీ చేసినట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ప్రవర్తన పారదర్శకంగా ఉందని, దర్యాప్తు సంస్థల పనితీరుకు సహకరించే విధంగానే వ్యవహరిస్తున్నానని తెలియజేయడానికే ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని ఈ నెల 4న సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐ,ఈడీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.