Soaps and hair shampoos: సామాన్యుడికి మరో షాక్.. సబ్బులు, హెయిర్ షాంపూలు ప్రియం
ఈ వార్తాకథనం ఏంటి
రోజువారీ వినియోగించే సబ్బులు, టూత్పేస్ట్, టూత్బ్రష్లు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు త్వరలో పెరగనున్నట్లు సమాచారం. కొన్ని కంపెనీలు ఈ ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయని ఆంగ్లపత్రికలు వెల్లడించాయి. గతేడాది సెప్టెంబరులో ఈ ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో, కంపెనీలు ఆ మేరకు ధరలను తగ్గించాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే, జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రభావం ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నదని, తయారీదారులు కొన్ని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
Details
మార్జన్లపై ఒత్తిడి పెరుగుతోంది
కమొడిటీల ధరలు పెరగడం, రూపాయి క్షీణత కారణంగా కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన గరిష్ఠ విక్రయ ధరలు (ఎంఆర్పీ) ముద్రించిన ప్యాక్లు ఇప్పటికే తమకు సరఫరా అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. డిటర్జెంట్లు, తలనూనె, చాక్లెట్లు, నూడిల్స్, అల్పాహార ఉత్పత్తులు వంటి పలు వస్తువుల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు డాబర్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి మోహిత్ మల్హోత్రా వెల్లడించారు. 2026-27లోనూ ధరల పెంపు కొనసాగవచ్చని ఆయన తెలిపారు.
Details
ధరల పెంపు త్వరలోనే అమల్లోకి
గృహ సంరక్షణ ఉత్పత్తుల ధరల పెంపు త్వరలో అమల్లోకి రానుందని, ఇప్పటికే పెంచిన ధరలతో ఉత్పత్తులను మార్కెట్లోకి పంపించామని హెచ్యూఎల్ ముఖ్య ఆర్థిక అధికారి నిరంజన్ గుప్తా తెలిపారు. హెచ్యూఎల్కి చెందిన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీమ్, డోమెక్స్ వంటి గృహ సంరక్షణ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ఇక డిసెంబరు త్రైమాసికంలోనే టీ ధరలను కొంత మేర పెంచినట్లు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. మొత్తంగా కమొడిటీ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరల పెంపు దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.