Asha Sharma: మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్కు చెందిన మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెకీకి కీలక బాధ్యతలు అప్పగించారు. గేమింగ్ డివిజన్కు కొత్త సీఈఓగా ఆశా శర్మను నియమించినట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఫిల్ స్పెన్సర్ పదవీవిరమణ చేయడంతో, ఆ స్థానంలో ఆశా శర్మ సీఈఓతో పాటు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్ కంటెంట్ రంగంలో ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న తీవ్ర పోటీ వంటి సవాళ్లను ఆమె ఎదుర్కొనాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్లో చేరే ముందు ఆశా శర్మ అనేక అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలలో ఉన్నత పదవుల్లో పనిచేశారు. అమె గతంలో మైక్రోసాఫ్ట్లోని కృత్రిమ మేధ (AI)విభాగంలో సీనియర్ అధికారిగా విధులు నిర్వర్తించారు.
Details
పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలో కీలక బాధ్యతలు
గేమ్ స్టూడియోలు, టైటిల్ల పర్యవేక్షణ బాధ్యతలు చూసే చీఫ్ కంటెంట్ ఆఫీసర్గా సీనియర్ అధికారి మాట్ బూటీకు పదోన్నతి కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. ఆశా శర్మ విద్యార్హతల విషయానికి వస్తే, ఆమె మిన్నెసోటా విశ్వవిద్యాలయం కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన ఆమె 2013లో సంస్థను వీడారు. అనంతరం పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్లోని కోర్ ఏఐ విభాగంలో సీనియర్ అధికారి హోదాలో తిరిగి చేరారు. ఇప్పుడు గేమింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్న ఆశా శర్మ నియామకం సంస్థ భవిష్యత్ వ్యూహాలకు కీలకంగా భావిస్తున్నారు.