LIC: ఎల్ఐసీ రూ.28 వేల కోట్ల షేర్ విక్రయం.. చివరి నిమిషంలో బ్యాంకర్లకు సమాచారం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరి క్షణం వరకు పూర్తి గోప్యత పాటిస్తూ, వేగంగా షేర్ విక్రయాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వం తొలుత అనుకున్నదానికంటే రెట్టింపుకుపైగా వాటాలను విక్రయించి 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28 వేల కోట్లు) సమీకరించింది. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగిన దేశంలోనే అతిపెద్ద సెకండరీ షేర్ ఆఫర్గా ఇది నిలిచింది.
వివరాలు
బ్యాంకర్లకూ చివరి నిమిషంలోనే సమాచారం
ఈ షేర్ విక్రయ తేదీని కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ (డివెస్ట్మెంట్) విభాగం అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం.
విక్రయానికి ముందే ట్రేడర్లు పెద్ద ఎత్తున షేర్లలో పొజిషన్లు తీసుకుని ధరలు పడిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ డీల్కు సలహాదారులుగా వ్యవహరించిన బ్యాంకులకు కూడా ఒకేసారి సమాచారం ఇవ్వకుండా, వేర్వేరు సమయాల్లో వివరాలు వెల్లడించారు.
అందులో ఒక బ్యాంకుకు అయితే సోమవారం స్టాక్ ఎక్స్చేంజ్కు సమాచారం పంపే కొద్దిసేపటి ముందే ఈ నిర్ణయం తెలిసినట్లు సమాచారం.
వివరాలు
చివరి క్షణంలోనే బ్యాంకర్లకు సమాచారం
డీల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు నలుగురు సలహాదారుల్లో ఒక బ్యాంకు ప్రతినిధిని ఢిల్లీలోని డివెస్ట్మెంట్ విభాగం కార్యాలయానికి అత్యవసరంగా పిలిపించినట్లు తెలుస్తోంది.
ఎందుకు పిలుస్తున్నారో కూడా ముందుగా చెప్పలేదని సమాచారం.
అక్కడికి వెళ్లిన తర్వాత అదే సాయంత్రం నుంచి ఎల్ఐసీ వాటాల విక్రయం ప్రారంభమవుతుందని అధికారులు తెలియజేసి, స్టాక్ ఎక్స్చేంజ్కు అవసరమైన ప్రకటనను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ విషయాన్ని ప్రారంభంలో కోర్ టీమ్కే పరిమితం చేసి, మార్కెట్ ముగిసిన తర్వాత మిగతా సలహాదారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఫీజు లేకుండానే సేవలు.. వ్యూహాత్మకంగా షేర్ విక్రయం
ఈ డీల్లో మరో విశేషం ఏమిటంటే.. సలహా సేవలు అందించిన నాలుగు బ్యాంకుల్లో ఏ ఒక్కటీ అడ్వైజరీ ఫీజు తీసుకోలేదని సమాచారం.
టెండర్ ప్రక్రియలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో, మిగతా మూడు బ్యాంకులు కూడా ఫీజులను వదులుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఒప్పందాల్లో ప్రతిష్ఠ, మార్కెట్ గుర్తింపు, దీర్ఘకాలిక సంబంధాల కోసం భారతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు చాలా సందర్భాల్లో తక్కువ లేదా ప్రతీకాత్మక ఫీజులతోనే పనిచేయడం సాధారణమే.
షేర్ విక్రయ సమయాన్ని కూడా ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ఎంచుకుంది.
వివరాలు
సమయానుకూల నిర్ణయంతో భారీ స్పందన
ఎల్ఐసీ త్రైమాసిక ఫలితాలు గురువారం విడుదలైన తర్వాతే ఈ విక్రయం జరుగుతుందని మార్కెట్ వర్గాలు భావించాయి.
అయితే అంచనాలను తారుమారు చేస్తూ ప్రభుత్వం ముందుగానే షేర్ విక్రయాన్ని ప్రారంభించింది.
ఇలా చేయడం వల్ల పెట్టుబడిదారులు చివరి వరకు సందిగ్ధంలో ఉండి, షేర్ ధర స్థిరంగా ఉండేందుకు అవకాశం కలిగిందని అధికారులు, బ్యాంకర్లు భావించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై స్పందించాలంటూ ప్రభుత్వ డివెస్ట్మెంట్ విభాగాన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు.
సలహాదారుల సూచన మేరకు ప్రభుత్వం తొలుత ఎల్ఐసీలో 2.5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది.
అయితే పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తే మరో 4 శాతం వరకు అదనంగా విక్రయించే అవకాశాన్ని కూడా ముందుగానే ఉంచింది.
వివరాలు
భారీ స్పందనతో లక్ష్యానికి మించి ఎల్ఐసీ షేర్ విక్రయం
ప్రారంభంలో తక్కువ వాటాను విక్రయానికి ఉంచడం వల్ల పూర్తిస్థాయిలో సబ్స్క్రిప్షన్ పొందే అవకాశాలు పెరుగుతాయని,అది పెద్ద పెట్టుబడిదారులకు సానుకూల సంకేతంగా మారుతుందని అధికారులు భావించారు.
ప్రభుత్వ వ్యూహం ఫలించింది. మంగళవారం సంస్థాగత పెట్టుబడిదారుల కోసం కేటాయించిన 2.5శాతం వాటాకు 3.32రెట్లు డిమాండ్ రావడంతో ప్రభుత్వం అదనపు వాటాల విక్రయానికి కూడా ముందుకొచ్చింది.
బుధవారం ముగిసిన రిటైల్ పెట్టుబడిదారుల కోటా 69శాతం మేర సబ్స్క్రైబ్ అయింది.
మొత్తంగా ఈ షేర్ విక్రయానికి 1.2రెట్లు సబ్స్క్రిప్షన్ లభించినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాలు వెల్లడించాయి.
ఈ లావాదేవీ పూర్తికావడంతో ఎల్ఐసీలో ప్రజల వాటా 10శాతానికి చేరుకోనుంది.
దీంతో మార్కెట్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన కనీస ప్రజావాటా నిబంధనను 2027 మే గడువుకు ముందుగానే ఎల్ఐసీ పూర్తి చేసినట్లవుతుంది.