Bank Strike Alert: దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. సెప్టెంబర్లో వరుస సమ్మెలకు ఉద్యోగ సంఘాల పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరోసారి సమ్మెకు రంగం సిద్ధమైంది. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విఫలమయ్యాయని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి ఐదు రోజుల పనిదినాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) విధానంలో మార్పులు సహా పలు కీలక డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో దశలవారీ ఆందోళనల షెడ్యూల్ను ప్రకటించాయి.
వివరాలు
దశలవారీగా సమ్మె..
యూఎఫ్బీయూ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నారు.
ఈ ఆందోళనల తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు స్పష్టం చేశాయి.
ఈ సమ్మెలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు, ఖాతాదారులకు అందే సేవలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.
వివరాలు
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
1. వారానికి ఐదు రోజుల పనిదినాలు
వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటి.
2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఐబీఏ అంగీకరించింది.
దీనికి ప్రతిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు ఉద్యోగులు అంగీకరించారు.
ఈ ప్రతిపాదనను ఐబీఏ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. అయితే రెండేళ్లు దాటినా దీనిపై ఇంకా తుది ఆమోదం లభించలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై యూనియన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
2. పీఎల్ఐ విధానంలో మార్పులు
కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) విధానంపై కూడా బ్యాంకు ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త విధానం ఉద్యోగుల మధ్య వివక్ష చూపేలా ఉందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
కొత్త విధానం ప్రకారం.. స్కేల్-4, అంతకంటే పై స్థాయి అధికారులకు వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా గరిష్ఠంగా 365 రోజుల బేసిక్ పే వరకు ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది.
మరోవైపు స్కేల్-3 వరకు ఉన్న అధికారులు, ఇతర సిబ్బందికి కేవలం 15 రోజుల బేసిక్ పే, డీఏ మాత్రమే అందుతుంది.
ఈ విధానం ఐబీఏతో కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా ఉందని యూఎఫ్బీయూ వాదిస్తోంది.
వివరాలు
ఇతర డిమాండ్లు కూడా..
బ్యాంకు మొత్తం పనితీరును ప్రాతిపదికగా తీసుకుని స్కేల్-7 వరకు ఉన్న ఉద్యోగులు, అధికారులందరికీ ఒకే విధమైన పీఎల్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఈ అంశం ప్రస్తుతం చీఫ్ లేబర్ కమిషనర్ వద్ద రాజీ ప్రక్రియలో ఉంది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టులోనూ దీనిపై విచారణ కొనసాగుతోంది.
పీఎల్ఐ, ఐదు రోజుల పనిదినాలకే పరిమితం కాకుండా మరికొన్ని పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని యూఎఫ్బీయూ కోరుతోంది.
వివరాలు
ఇతర డిమాండ్లు కూడా..
పెన్షన్ల సవరణ,పెన్షనర్లందరికీ ఒకే డీఏ ఫార్ములాను అమలు చేయడం,నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారే అవకాశం కల్పించడం వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ వెంటనే స్పందించి చర్చలు ప్రారంభించాలని యూఎఫ్బీయూ కోరింది.
సమస్యల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.