India US Trade Talks: యూఎస్ ట్రేడ్ టాక్స్లో మాకు బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్: అమెరికా ప్రతినిధి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగా భారత్ నుండి అందే అత్యుత్తమ వాణిజ్య అవకాశాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ విశ్లేషించారు. ఆయన ప్రకారం, భారత వ్యవసాయ మార్కెట్లో విస్తరణ సాధించేందుకు, వివిధ అడ్డంకులను తొలగించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను సెనెట్ కేటాయింపుల సబ్కమిటీ ముందు తెలిపారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రగతి సాధిస్తున్నామని గ్రీర్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం న్యూదిల్లీలో చర్చలు నిర్వహిస్తోంది. అలాగే, అమెరికా వస్తువులు చైనా మార్కెట్లో ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో, భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్గా మారవచ్చని సూచించారు.
వివరాలు
యూఎస్ తరఫున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్
దిల్లీలో జరిగే చర్చల్లో యూఎస్ తరఫున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ పాల్గొంటున్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని తెలిసిందే. ఈ నేపధ్యంలో, వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగడం ఇది రెండవసారి. గతంలో సెప్టెంబర్ 16న అగ్రరాజ్య ప్రతినిధులు భారత్కు చేరుకుని చర్చలు జరిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది.
వివరాలు
2030 నాటికి వాణిజ్య విలువ 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యం
వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఇటీవల వెల్లడించినట్లు, ఏడాదికల్లా అమెరికాతోని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశలో కుదిరే అవకాశముందని తెలిపారు. ఈ ఒప్పందంలో భారత ఎగుమతిదారులకు లాభం కలిగే విధంగా సుంకాల సమస్యను చర్చించనున్నారు. అలాగే, టారిఫ్ల సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరిన్ని చర్చలు జరగబోతున్నాయి. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య విలువ 191 బిలియన్ డాలర్లు ఉండగా, 2030 నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని పెట్టారు.