Andhra News: రూ.9 వేల కోట్లతో.. ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది. విశాఖపట్టణం కేంద్రంగా డేటా సెంటర్ల ఏర్పాటు, రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలు, భారీ పెట్టుబడి ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ డిమాండ్ కనీసం 2,000 మెగావాట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి అవసరాలను ప్రస్తుతం ఉన్న నెట్వర్క్తో సమర్థంగా తీర్చడం కష్టమని, అందుకే అదనపు మౌలిక వసతుల కల్పన తప్పనిసరిగా మారిందని స్పష్టం చేస్తున్నారు. అలాగే కొత్తగా ఏర్పడుతున్న పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించాలంటే నెట్వర్క్ విస్తరణ అవసరమని భావిస్తున్నారు.
వివరాలు
రూ.6,000 కోట్ల వ్యయంతో చేపట్టిన సుమారు 60 పనులు
ఈ లక్ష్యంతో ఈ ఏడాది డిసెంబరు నాటికి సుమారు రూ.9,000 కోట్ల వ్యయంతో కొత్త లైన్లు, సబ్స్టేషన్లు, సాంకేతిక విస్తరణ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పెండింగ్లో ఉన్నవాటితో పాటు కొత్తగా ప్రతిపాదించిన పనులు కలిపి మొత్తం 108 పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేసేలా రోడ్మ్యాప్ను సిద్ధం చేశారు. తొలిదశలో తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశమున్న పనులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రారంభమై పూర్తి కాకుండా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం రూ.6,000 కోట్ల వ్యయంతో చేపట్టిన సుమారు 60 పనులు ప్రస్తుతం వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి.
వివరాలు
పనుల విలువ సుమారు రూ.2,000 కోట్లుగా అంచనా
వీటిలో 20 శాతం కన్నా తక్కువ పనులు మిగిలి ఉన్న ప్రాజెక్టులను ముందుగా గుర్తించి, వచ్చే రెండు నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనుల విలువ సుమారు రూ.2,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో సర్క్యూట్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వంటి కీలక పనులు ఉన్నాయి. నెట్వర్క్ మరింత బలోపేతం కోసం కొత్తగా 132, 220, 400 కేవీ సామర్థ్యంతో సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 48 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి, గుత్తేదారులకు పనులు అప్పగించనున్నారు. అదేవిధంగా కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం 'మోనో పోల్స్'ను వినియోగిస్తున్నారు.
వివరాలు
మానవ రహిత విధానంలో 400 కేవీ సబ్స్టేషన్లు నిర్వహించేలా ఆధునిక సాంకేతికత
సాధారణ టవర్ పోల్స్తో పోలిస్తే ఇవి తక్కువ స్థలంలో ఏర్పాటు చేయవచ్చని, బలమైన గాలులకు కూడా ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. మరోవైపు ట్రాన్స్కో పరిధిలో ఉన్న 400 కేవీ సబ్స్టేషన్లను మానవ రహిత విధానంలో నిర్వహించేలా ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని కేంద్ర విద్యుత్ సంస్థ పవర్గ్రిడ్ ఇప్పటికే అమలు చేస్తోంది. దీనికోసం'స్టేట్ ఎసెట్ ట్రాన్స్మిషన్ మేనేజ్మెంట్ సెంటర్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం నుంచి సబ్స్టేషన్ల కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రాన్స్కో వద్ద 400కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్లు సుమారు 18వరకు ఉన్నాయి.