Loading...
Oil Prices: 92 డాలర్లకు చేరువలో బ్రెంట్.. భారత్ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు
92 డాలర్లకు చేరువలో బ్రెంట్.. భారత్ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు

Oil Prices: 92 డాలర్లకు చేరువలో బ్రెంట్.. భారత్ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను మరోసారి కుదిపేశాయి. ఈ పరిణామాల ప్రభావంతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్క్‌ను దాటింది. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్చేంజ్‌లో సెప్టెంబర్ బ్రెంట్ కాంట్రాక్ట్ ధర బ్యారెల్‌కు 92.50 డాలర్ల వద్ద ట్రేడవుతూ, గత ముగింపు ధరతో పోలిస్తే 2.33 శాతం పెరిగింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో ధరలు దాదాపు 8 శాతం ఎగబాకి 90.80 డాలర్ల వరకు చేరి, చివరకు 90.74 డాలర్ల వద్ద ముగిశాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వివరాలు 

అమెరికా దాడులతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం

ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో చమురు సరఫరాకు అంతరాయం కలగొచ్చనే ఆందోళనలను పెంచుతున్నాయి.

అల్ జజీరా కథనం ప్రకారం,అమెరికా దళాలు ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంలోని ఓ నివాస భవనంపై బాంబులు వేసినట్లు సమాచారం.

ఈ ఘటనలో దంపతులతో పాటు వారి రెండేళ్ల చిన్నారి మృతి చెందినట్లు పేర్కొంది.

అలాగే కిష్ ద్వీపం,బుషెహర్, ఇరాన్ చమురు పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఖుజేస్తాన్ ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వెల్లడించింది.

మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ దక్షిణ లెబనాన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

దేశ భద్రత పూర్తిగా నిర్ధారితమైన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.

వివరాలు 

భారత్‌కు పెరుగుతున్న ఆర్థిక ఆందోళనలు  

అమెరికా దాడులు, ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల చర్యలు, లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వైఖరి వంటి పరిణామాలు చూస్తే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరలో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

గత ఐదు నెలలుగా కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతి దేశమైన భారత్‌కు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చమురు ధరలు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే దిగుమతి వ్యయం భారీగా పెరగడంతో పాటు ద్రవ్యోల్బణంపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ముడి చమురు ఖరీదు పెరిగితే రూ.18 వేల కోట్ల అదనపు భారం

బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం,ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున ఏడాది పాటు పెరిగితే భారత్ దిగుమతి బిల్లుపై సుమారు రూ.18వేల కోట్ల అదనపు భారం పడుతుంది.

ప్రస్తుతం దేశ వార్షిక చమురు దిగుమతి బిల్లు సుమారు 120 బిలియన్ డాలర్లు.

ఇది మొత్తం వస్తు దిగుమతుల్లో 17 నుంచి 25శాతం వరకు వాటాను కలిగి ఉంది.

పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్(PPAC)గణాంకాల ప్రకారం,ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ ముడి చమురు దిగుమతి బిల్లు 49.8బిలియన్ డాలర్లకు చేరింది.

ఇది గత ఏడాదితో పోలిస్తే 61శాతం అధికం.ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం చమురు దిగుమతి బిల్లులో దాదాపు 40శాతం కావడం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు 

ద్రవ్యోల్బణం పెరుగుదల.. రష్యా చమురుపై కొత్త ఆందోళనలు

ఇప్పటికే దేశీయంగా కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. ఆహారం,ఇంధన ధరలు పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరింది.

దీంతో రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్న 4 శాతం మధ్యస్థాయిని 2025 జనవరి తర్వాత తొలిసారి దాటింది.

ఇంకో సవాలు కూడా భారత్ ముందుంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న ఐదు అతిపెద్ద దేశాలపై అమెరికా సెనేట్ కొత్త సుంకాలు విధించే బిల్లును పరిశీలిస్తోంది.

ఇందులో భారత్ కూడా ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో 50 శాతానికి పైగా రష్యా నుంచే వస్తోంది.

వివరాలు 

రవాణా మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి

ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ప్రపంచంలో అత్యంత కీలకమైన రెండు ఇంధన సముద్ర మార్గాలైన బాబ్ ఎల్-మండెబ్ జలసంధి,హోర్ముజ్ జలసంధి మీద నౌకల రాకపోకలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

అయితే యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ట్రాఫిక్ ఇంకా గణనీయంగా తక్కువగానే ఉంది.

ఎస్ అండ్ పీ గ్లోబల్ కమోడిటీస్ ఎట్ సీ గణాంకాల ప్రకారం, జూలై 28న బాబ్ ఎల్-మండెబ్ జలసంధి గుండా 34 నౌకలు, హోర్ముజ్ జలసంధి గుండా 16 నౌకలు ప్రయాణించాయి.

అంతకుముందు రోజు ఇవి వరుసగా 32, 15 మాత్రమే ఉన్నాయి.

యుద్ధానికి ముందు హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు దాదాపు 130 నౌకలు, బాబ్ ఎల్-మండెబ్ గుండా 46 నౌకలు ప్రయాణించేవి.

వివరాలు 

రవాణా మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి

తాజా దాడుల నేపథ్యంలో కూడా నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోలేదని నివేదిక పేర్కొంది.

అయితే అమెరికా, ఇరాన్, వాటి మిత్రదేశాల మధ్య దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి ఎప్పుడు మారుతుందో చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చమురు సరఫరాపై ఎలాంటి అంతరాయం ఏర్పడినా ప్రపంచ ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT