Data center: డేటా సెంటర్ డెవలపర్ క్రూసోకు భారీ నిధులు.. కంపెనీ విలువ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ డేటా సెంటర్ డెవలపర్ క్రూసో (Crusoe) భారీగా నిధులు సమీకరించింది. మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు డేటా సెంటర్ సేవలు అందిస్తున్న క్రూసో.. తాజాగా జరిగిన ఫండింగ్ రౌండ్లో ఏకంగా 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.5 లక్షల కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ ఏకంగా 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ పెట్టుబడి రౌండ్కు అట్రీడెస్ మేనేజ్మెంట్, వాలర్ ఈక్విటీ పార్ట్నర్స్ సంయుక్తంగా నాయకత్వం వహించాయి. అబుదాబి సార్వభౌమ సంపద నిధి ముబాదలా ఆధ్వర్యంలోని అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ముబాదలా క్యాపిటల్ కూడా ఈ రౌండ్లో పాల్గొంది.
వివరాలు
జేన్ స్ట్రీట్తో క్రూసో $13 బిలియన్ల క్లౌడ్ డీల్
ఇటీవల క్రూసో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్తో ఐదేళ్ల కాలానికి 13 బిలియన్ డాలర్ల విలువైన క్లౌడ్ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా జేన్ స్ట్రీట్కు అవసరమైన జీపీయూలు (GPUs), ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రూసో అందించనుంది.
గత ఏడాది అక్టోబర్లో క్రూసో 1.38 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.
అప్పుడు కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా జరిగిన ఫండింగ్తో ఏడాది వ్యవధిలోనే కంపెనీ విలువ భారీగా పెరిగింది.
వివరాలు
క్రిప్టో మైనింగ్ నుంచి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు..
2018లో ప్రారంభమైన క్రూసో తొలుత ఫ్లేర్డ్ నేచురల్ గ్యాస్ను ఉపయోగించి క్రిప్టో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేది.
అయితే కాలక్రమేణా కంపెనీ తన వ్యాపారాన్ని పూర్తిగా మార్చుకుంది. ప్రస్తుతం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ రంగాల్లో కీలక సంస్థగా ఎదిగింది.
ఒరాకిల్, ఓపెన్ఏఐ వంటి సంస్థల కోసం హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్లను నిర్మిస్తున్న సంస్థగా క్రూసో గుర్తింపు పొందింది.
ఇక సమీప భవిష్యత్తులో ఐపీఓకు వెళ్లే అవకాశాలపై కూడా కంపెనీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై చర్చించేందుకు క్రూసో ప్రతినిధులు గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను కలిసినట్లు గత నెలలో యాక్సియోస్ నివేదించింది.