Digital gold: డిజిటల్ గోల్డ్పై కొత్త నిబంధనలు? కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారానికి దేశంలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఆభరణాల కొనుగోలుకే పరిమితమైన పసిడి.. ఇప్పుడు పెట్టుబడి సాధనంగానూ మారింది. ఫిజికల్ గోల్డ్తో పాటు డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ గోల్డ్ రంగంపై మరింత పర్యవేక్షణ తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
వివరాలు
ఫిజికల్ గోల్డ్కు తగిన బ్యాకింగ్
డిజిటల్ గోల్డ్కు సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనల్లో ముఖ్యమైనది.. ప్రతి డిజిటల్ గోల్డ్ యూనిట్కు సరిపడా భౌతిక బంగారం నిల్వ ఉండేలా నిబంధనలు తీసుకురావడం.
అంటే..ఆన్లైన్లో వినియోగదారులకు విక్రయించే బంగారం పరిమాణానికి అనుగుణంగా నిజమైన బంగారాన్ని కూడా భద్రపరిచి ఉండాలి.
ఈ విధానం అమలైతే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు లావాదేవీల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది.
ఆర్బీఐ,సెబీ పరిధిలోకి వస్తుందా?
డిజిటల్ గోల్డ్ను సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్,1956 కింద సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనపై సంబంధిత వర్గాల్లో ఏకాభిప్రాయం ఏర్పడినట్లు సమాచారం.
2025లోనే సెబీ డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై ప్రజలను అప్రమత్తం చేసింది.
డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రించే సెక్యూరిటీలు లేదా కమోడిటీ డెరివేటివ్స్ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.
వివరాలు
చిన్న మొత్తాలతో పెట్టుబడి అవకాశం
అందువల్ల గోల్డ్ ఈటీఎఫ్ల వంటి సెబీ నియంత్రిత పెట్టుబడి ఉత్పత్తులకు లభించే నియంత్రణపరమైన రక్షణ.. డిజిటల్ గోల్డ్కు ప్రస్తుతం వర్తించదని పేర్కొంది.
డిజిటల్ గోల్డ్కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం.. తక్కువ మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించవచ్చనే సౌలభ్యం.
పరిశ్రమ అంచనాల ప్రకారం, దేశంలోని డిజిటల్ గోల్డ్ రంగంలో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో సగటు పెట్టుబడి మొత్తం దాదాపు రూ.100గా ఉందని అంచనాలు చెబుతున్నాయి.
అయితే ఈ రంగానికి స్పష్టమైన నియంత్రణ లేకపోవడం వల్ల అనధికార ఆపరేటర్లు ప్రవేశించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పెట్టుబడిదారుల రక్షణతో పాటు మనీలాండరింగ్ వంటి అంశాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివరాలు
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు
డిజిటల్ గోల్డ్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో కొంత పర్యవేక్షణ అవసరమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వినియోగదారుల్లో డిజిటల్ గోల్డ్, సిల్వర్కు ఆదరణ పెరుగుతున్నందున నియంత్రణ అవసరమని ఎంఎంటీసీ-పీఏఎంపీ మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ గుహా పేర్కొన్నారు.
ఈ ఏడాది డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్లు కలిసి 'డిజిటల్ ప్రీషియస్ మెటల్స్ అష్యురెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' అనే స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశాయి.
ఇందులో ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్తో పాటు ఫోన్పే, భారత్పే, మొబిక్విక్, లెండెన్ క్లబ్, క్రెడ్ వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.