LOADING...
Navi Mumbai :నవి ముంబై విమానాశ్రయంలో నెట్‌వర్క్ సమస్య: అదానీ గ్రూప్‌కు డీఓటీ ఆదేశాలు
నవి ముంబై విమానాశ్రయంలో నెట్‌వర్క్ సమస్య: అదానీ గ్రూప్‌కు డీఓటీ ఆదేశాలు

Navi Mumbai :నవి ముంబై విమానాశ్రయంలో నెట్‌వర్క్ సమస్య: అదానీ గ్రూప్‌కు డీఓటీ ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఎంఐఏ)లో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) రంగంలోకి దిగింది. విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలకు నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఫిబ్రవరి 16న అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌కు రాసిన లేఖలో, టెలికాం చట్టం-2023 ప్రకారం నవి ముంబై విమానాశ్రయం 'పబ్లిక్ ఎంటిటీ'గా పరిగణనలోకి వస్తుందని, అందువల్ల టెలికాం ఆపరేటర్లకు నెట్‌వర్క్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందేనని డీఓటీ స్పష్టం చేసింది. విమానాశ్రయంలో ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లు లేకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ జోక్యం చోటు చేసుకుంది.

వివరాలు 

అధిక ఛార్జీలతో అదానీ ఒత్తిడి.. టెలికాం సంస్థల ఫిర్యాదు

టెలికాం సంస్థలు తమకు అక్కడ నెట్‌వర్క్ వేసుకునే అవకాశం ఇవ్వకుండా,అదానీ సంస్థ తమ సొంత ఇన్‌బిల్డింగ్ నెట్‌వర్క్‌ను అధిక ఛార్జీలతో వాడాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించాయి. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన టెలికాం సంస్థలు, నెలకు ఒక్కో ఆపరేటర్ నుంచి సుమారు రూ.92 లక్షలు, ఏడాదికి నాలుగు ఆపరేటర్లకు కలిపి రూ.44 కోట్లకు పైగా వసూలు చేయాలని విమానాశ్రయం అడుగుతోందని తెలిపాయి. రైట్ ఆఫ్ వే అనుమతులను న్యాయంగా, పారదర్శకంగా, వివక్ష లేకుండా ప్రాసెస్ చేయాలని, చట్టం ప్రకారం అవసరమైన టెలికాం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సహకరించాలని డీఓటీ అదానీ గ్రూప్‌ను కోరింది.

వివరాలు 

నెట్‌వర్క్ ఛార్జీలపై ట్రాయ్ పరిశీలన.. తగ్గింపు ప్రతిపాదనకూ టెలికాం సంస్థల అభ్యంతరం

ఈ అంశంపై ట్రాయ్ కూడా ధరల సమస్యను పరిశీలిస్తోంది. ముంబై విమానాశ్రయంతో సమానంగా నెలకు రూ.40 లక్షల వరకు తగ్గించేందుకు ప్రతిపాదన వచ్చినా, ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుంటే అది కూడా సమంజసం కాదని టెలికాం సంస్థలు అంగీకరించలేదు. ఢిల్లీలాంటి పెద్ద విమానాశ్రయాల్లో నెలకు రూ.10-12 లక్షలే చెల్లిస్తున్నామని అవి చెబుతున్నాయి. ధరలతో పాటు రైట్ ఆఫ్ వే అనుమతులు ఇవ్వలేదని టెలికాం సంస్థలు ఆరోపిస్తే, ఎన్‌ఎంఐఏ మాత్రం ఎవరికి కూడా అనుమతి నిరాకరించలేదని చెప్పింది. టెలికాం చట్టం ప్రకారం పబ్లిక్ ప్రాపర్టీని నిర్వహించే సంస్థలు నెట్‌వర్క్ ఏర్పాటుకు సహకరించాల్సి ఉంటుందని, వసూలు చేసే ఫీజులు కేవలం పరిపాలనా ఖర్చులకే పరిమితం కావాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement