LOADING...
EPFO: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త.. జులై 15లోగా వడ్డీ జమ
ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త.. జులై 15లోగా వడ్డీ జమ

EPFO: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త.. జులై 15లోగా వడ్డీ జమ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్‌ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని జులై 15 నాటికి ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 34 కోట్ల ఈపీఎఫ్‌ ఖాతాల్లో మొత్తం రూ.1.44 లక్షల కోట్ల మేర వడ్డీ జమ కానుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించిన విషయం తెలిసిందే.

వివరాలు 

చివరి దశలో వడ్డీ జమ ప్రక్రియ

వడ్డీ జమకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఫీల్డ్‌ స్థాయిలో ధృవీకరణ (వెరిఫికేషన్‌) పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా, అనంతరం వారంలోపు అర్హులైన చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేయనున్నారు. గతంలో వార్షిక వడ్డీ ప్రకటించిన తర్వాత చందాదారుల ఖాతాల్లో డబ్బు జమ కావడానికి సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు సమయం పట్టేది. అయితే ఈసారి ఆధునిక ఆటోమేటెడ్‌ విధానాన్ని అమలు చేయడంతో ప్రక్రియ వేగవంతమైందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇటీవల వెల్లడించారు.

వివరాలు 

కొత్త డిజిటల్‌ వ్యవస్థతో సేవలు మరింత వేగంగా

సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈపీఎఫ్‌ఓ 'సెంట్రలైజ్డ్‌ ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌' పేరుతో కొత్త డిజిటల్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో ప్రాంతీయ, ఫీల్డ్‌ కార్యాలయాలు విడివిడిగా తమ డేటాబేస్‌లను నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వివరాలను ఒకే జాతీయ డేటాబేస్‌లో సమీకరించారు. దీని వల్ల సభ్యుల రికార్డులు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో సేవల వేగం పెరగనుంది. ఇకపై దేశంలోని ఏ ఈపీఎఫ్‌ఓ కార్యాలయం నుంచైనా సభ్యుల దరఖాస్తులు, అభ్యర్థనలను పరిశీలించి ప్రాసెస్‌ చేసే అవకాశం ఉంటుంది. దీంతో సేవల అందుబాటు మరింత సులభంగా, త్వరగా ఉండనుందని అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

త్వరలో ఒకే 'యునిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌'

చందాదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే 'యునిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌'ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. ఈ పోర్టల్‌లో ఒకసారి లాగిన్‌ అయితే పీఎఫ్‌ బ్యాలెన్స్‌, క్లెయిమ్‌ స్థితి, ఇతర ఈపీఎఫ్‌ సేవలన్నింటినీ ఒకే చోట నుంచి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇందుకోసం వేర్వేరు పోర్టల్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అంతేకాకుండా, ఆటోమేటెడ్‌ క్లెయిమ్‌ల పరిమితిని కూడా రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా సభ్యులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలు చేపట్టింది.

Advertisement