West Asian War: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ప్యాకేజ్డ్ ఫుడ్కు భారీ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారతదేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో అంతరాయం ఏర్పడి, ప్రజల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గిపోవడంతో గంటల తరబడి వంట చేసే బదులు నిమిషాల్లో సిద్ధమయ్యే 'రెడీ-టు-ఈట్' ఆహార పదార్థాలపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. భారత్ తన వంటగ్యాస్ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతుండగా హర్మూజ్ జలసంధి మార్గంలో ఏర్పడిన రవాణా అంతరాయాలు సరఫరాను ప్రభావితం చేశాయి. దీంతో గత 15 రోజుల్లోనే దేశీయ ఎల్పీజీ వినియోగం గతేడాదితో పోలిస్తే 17.7 శాతం తగ్గింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ తగ్గుదల 26.3 శాతానికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
Details
వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గించారు
గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ, హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగించే వాణిజ్య సిలిండర్ల సరఫరాను తగ్గించింది. ఈ కారణంగా హోటళ్లలో ధరలు పెరగడం, లభ్యత తగ్గిపోవడంతో మధ్యతరగతి ప్రజలు ప్యాకేజ్డ్ పులిహోర, ఉప్మా, బిర్యానీ వంటి 'హీట్ అండ్ ఈట్' ఆహారాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులకూ మంచి గిరాకీ పెరుగుతోంది. ఇక వంటగ్యాస్ కొరత ప్రభావంతో ఇన్స్టంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ మీల్స్, స్నాక్స్ విభాగాల్లో 15 శాతం పైగా వృద్ధి నమోదైందని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఈ ధోరణి హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, నగరాల్లోనూ విస్తరిస్తోందని తెలిపింది.