
EPFO: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో ATM విత్డ్రా ఫెసిలిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎఫ్ఓ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే పీఎఫ్ ఖాతా నుంచి నేరుగా ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు అక్టోబర్ రెండో వారంలో జరగబోయే సమావేశంలో తీసుకోనుందని 'మనీ కంట్రోల్' విశేషాలు వెల్లడించింది. గతంలోనే కార్మికశాఖ ఈ సదుపాయాన్ని 2024 జూన్ నుంచి అమల్లోకి తేవాలని ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిద్ధం చేసింది. అయితే విత్డ్రాలకు సంబంధించి పరిమితి (లిమిట్) విధించే అంశంపై బోర్డు సమావేశంలో మరింతగా చర్చించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Details
'భవిష్యనిధి' అసలు ఉద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం
పరిమితి లేకుండా విత్డ్రాలు అనుమతిస్తే, 'భవిష్యనిధి' అసలు ఉద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకి 7.8 కోట్లమంది సభ్యులు ఉండగా, వారి వద్ద కలిపి దాదాపు రూ.28 లక్షల కోట్ల కార్పస్ ఉంది. అత్యవసర సమయాల్లో చందాదారుల తక్షణ నగదు అవసరాలను తీర్చేందుకు ఈ సదుపాయం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దిశగా బ్యాంకులు, ఆర్బీఐతో కార్మికశాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. ఏటీఎం మాదిరిగానే పనిచేసే విధంగా సభ్యులకు ప్రత్యేక కార్డు జారీ చేయనుంది. ఆ కార్డు ద్వారా అవసరమైన మొత్తాన్ని ఏటీఎం వద్ద ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ట్రస్టీల బోర్డు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్డ్రాల పరిమితి, నిబంధనలు వంటి అంశాలపై మరింత స్పష్టత రానుంది.