EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆటోమేటిక్ సేవలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) తన ఖాతాదారులకు శుభవార్తను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్వో 3.0వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు పార్లమెంట్లో వెల్లడించింది. ఈ సందర్భంగా కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శోభా కరంద్లాజే ఈ కొత్త వ్యవస్థలో చేపట్టిన మార్పులను వివరించారు. పీఎఫ్, పెన్షన్ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్వో 3.0ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ విధానంలో పూర్తిగా పేపర్లెస్ ప్రక్రియను అమలు చేస్తూ, ఫిజికల్ డాక్యుమెంట్ల సమర్పణకు ముగింపు పలికినట్లు స్పష్టం చేశారు. అలాగే సేవలను ఆటోమేషన్ ద్వారా అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులు ఇప్పుడు ఒకే ఏకీకృత ప్లాట్ఫామ్ ద్వారా తమ ఖాతాలను నిర్వహించుకునే అవకాశం పొందుతున్నారు. కాగితపు పనిని తగ్గించేందుకు సేవలను క్రమబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.
Details
పింఛన్దారులకు పెద్ద ఊరట
ఈపీఎఫ్వో 3.0లో భాగంగా కేంద్రీకృత పింఛన్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థను గత ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి తీసుకువచ్చారు. ఇంతకుముందు పింఛన్ను కొద్ది బ్యాంకుల ద్వారానే పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారా అయినా పింఛన్ పొందే అవకాశం కల్పించారు. దీని వల్ల ప్రతి నెలా 70 లక్షలకుపైగా పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. చెల్లింపులు వేగంగా జరగడంతో పాటు, జాప్యాలు మరియు లోపాలు గణనీయంగా తగ్గనున్నాయి.
Details
రూ.5 లక్షల వరకు ఆటో సెటిల్మెంట్
జూన్ 2025 నుంచి ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్లు ఇక ఆటోమేటిక్గా సెటిల్ అవుతాయి. ఇప్పటివరకు ఈ విధానంలో 3.52 కోట్ల క్లెయిమ్లు పరిష్కరించగా, మొత్తం క్లెయిమ్లలో 71.37 శాతం ఆటో మోడ్లోనే ప్రాసెస్ చేశారు.
Details
యజమాని అనుమతి లేకుండానే పీఎఫ్ బదిలీ
పీఎఫ్ బదిలీ ప్రక్రియను కూడా మరింత సులభతరం చేశారు. ఇక నుంచి యజమాని అనుమతి అవసరం లేకుండానే బదిలీ చేసుకునే సౌలభ్యం కల్పించారు. దీంతో మాన్యువల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్లు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవైసీ పూర్తి చేసిన సభ్యులకు యజమాని ఆమోదం లేకుండానే బదిలీలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇప్పటివరకు 70.5లక్షలకుపైగా బదిలీ క్లెయిమ్లు ఆటోమేటిక్గా ప్రారంభమయ్యాయి. అందులో 21.39 లక్షల బదిలీలు యజమాని ప్రమేయం లేకుండానే పూర్తయ్యాయి. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు ఈ మార్పులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే పెన్షన్ పరిమితి పెంపుపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంట్లో వెల్లడించింది.