Sugar Exports: చక్కెర ధరల నియంత్రణకు ఎగుమతులపై కేంద్రం బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో చక్కెర ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గకుండా, ధరలు పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన విదేశీ వాణిజ్య ప్రధాన సంచాలక కార్యాలయం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.
వివరాలు
కస్టమ్స్ శాఖకు అప్పగించిన చక్కెర నిల్వలకు ఎగుమతులకు అనుమతి
అయితే, తాజా ఉత్తర్వులు వెలువడే ముందు నుంచే లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైన సరుకులు, కస్టమ్స్ శాఖకు అప్పగించిన చక్కెర నిల్వలకు మాత్రం ఎగుమతులకు అనుమతి ఉంటుందని వెల్లడించింది. ఇదే సమయంలో ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా దేశాలు, అమెరికాకు పంపాల్సిన చక్కెర ఎగుమతులకు ఈ నిషేధం వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.