LOADING...
Petrol pumps: వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్‌ దాటిన పెట్రోల్‌ పంపుల సంఖ్య
వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్‌ దాటిన పెట్రోల్‌ పంపుల సంఖ్య

Petrol pumps: వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్‌ దాటిన పెట్రోల్‌ పంపుల సంఖ్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయ కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పదేళ్లలో దేశవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌ చివరి నాటికి దేశంలో మొత్తం 1,00,266 పెట్రోల్‌ పంపులు ఉన్నాయని తెలిపింది. 2015లో ఈ సంఖ్య కేవలం 50,451 మాత్రమే ఉండటం గమనార్హం. వాహనాల కొనుగోళ్లు భారీగా పెరగడం కారణంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల వెంట పెట్రోల్‌ పంపుల విస్తరణ గణనీయంగా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే, పెట్రోల్‌ పంపుల సంఖ్యలో అమెరికా (1,96,643), చైనా (1,15,228)తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. దేశీయంగా పెట్రోల్‌ పంపుల నిర్వహణలో ప్రభుత్వరంగ సంస్థలదే ఆధిపత్యం.

Details

ప్రయివేటు సంస్థల వాటా 9.3శాతం

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) ఆధ్వర్యంలోనే దేశంలోని మొత్తం పెట్రోల్‌ పంపుల్లో 90 శాతానికి పైగా ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు అనుబంధ సంస్థ నయారా ఎనర్జీ లిమిటెడ్‌ 6,921 పంపులు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌-బీపీ సంయుక్తంగా 2,114 పంపులు, షెల్‌ 346 పెట్రోల్‌ పంపులను నిర్వహిస్తున్నాయి. భారత్‌లో ప్రైవేట్‌ సంస్థల పెట్రోల్‌ పంపుల కార్యకలాపాలు 2003-04లో 27 కేంద్రాలతో ప్రారంభమయ్యాయి. 2015 నాటికి దేశంలోని మొత్తం 50,451 పెట్రోల్‌ పంపుల్లో ప్రైవేటు సంస్థల వాటా 2,967 కేంద్రాలు (5.9%) మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఈ వాటా 9.3 శాతానికి పెరిగింది.

Details

ఐఓసీకే అధిక పంపులు

దేశంలో అత్యధికంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 41,664 పెట్రోల్‌ పంపులను నిర్వహిస్తోంది. దాని తర్వాత భారత్‌ పెట్రోలియం 24,605 కేంద్రాలు, హిందుస్థాన్‌ పెట్రోలియం 24,418 పంపులను నిర్వహిస్తున్నాయి. మొత్తం పెట్రోల్‌ పంపుల్లో గ్రామీణ ప్రాంతాల వాటా దశాబ్దం క్రితం 22 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 29 శాతానికి పెరిగింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఈ కేంద్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ, ఈవీ ఛార్జింగ్‌ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement