Hyderabad: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. ఉత్తర్వులు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు భాగాలుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభజనలో జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ను యథాతథంగా కొనసాగించగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు శ్రీజనను, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది.
వివరాలు
డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత 243 డివిజన్లు
ఇక పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 150 డివిజన్లు డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత 243 డివిజన్లుగా పెరిగాయి. విలీనమైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో అదనంగా 57 డివిజన్లు ఏర్పడ్డాయి. ఈ విధంగా మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం,అధికారాల వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను అధికారికంగా ఏర్పాటు చేసింది.