unpaid work: జీతం లేని పనిలో భారతీయులే టాప్.. వారానికి 16 గంటలకు పైగా అదనపు పని.. ఏడీపీ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
పని విషయంలో భారతీయులు కష్టపడి పనిచేస్తారనే అభిప్రాయం ఉంది. అయితే ఈ శ్రమలో కొంత భాగం అదనపు వేతనం లేకుండానే సాగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏడీపీ సంస్థ విడుదల చేసిన 'పీపుల్ ఎట్ వర్క్ 2026' నివేదికలో భారత్కు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధికంగా జీతం లేని అదనపు పని గంటలు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచినట్లు నివేదిక పేర్కొంది.
వివరాలు
భారత్లో ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ఒకరు..
దేశంలోని ఉద్యోగుల్లో 24శాతం మంది వారానికి 16గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఎలాంటి అదనపు వేతనం లేకుండా పనిచేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
మరో 40శాతం మంది వారానికి 6 నుంచి 15 గంటల వరకు జీతం లేని అదనపు పని చేస్తున్నట్లు వెల్లడైంది.
అంటే భారత శ్రామికశక్తిలో గణనీయమైన వర్గం తమ సాధారణ పని సమయానికి అదనంగా ఎలాంటి ప్రతిఫలం లేకుండానే ఎక్కువ సమయం కేటాయిస్తోంది.
ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో వారానికి 16గంటలకు పైగా అదనపు పని చేస్తున్న ఉద్యోగుల వాటా కేవలం 12 శాతంగా ఉంది.
వివరాలు
ఎక్కువ గంటలు పనిచేస్తే ఉత్పాదకత పెరగదు..
ఈ లెక్కల ప్రకారం భారత్లో జీతం లేకుండా ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగుల సంఖ్య ప్రపంచ సగటు కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అయితే ఎక్కువ సమయం పనిచేయడం వల్ల ఉద్యోగుల పనితీరు అదే స్థాయిలో పెరుగుతుందని భావించడం సరికాదని నివేదిక సూచించింది.
అదనపు పనిభారం ఎదుర్కొంటున్న ఉద్యోగుల్లో చాలామంది తాము ఆశించిన స్థాయిలో ఉత్పాదకతను సాధించలేకపోతున్నామని అంగీకరించారు.
అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే వారి సంఖ్య, ఉద్యోగం మార్చుకోవాలని భావిస్తున్న వారి వాటా కూడా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.
వివరాలు
రిమోట్ ఉద్యోగులు, యువతలో ఎక్కువ..
జీతం లేని అదనపు పని గంటలు ఎక్కువగా ఉన్న ఉద్యోగుల్లో తమ పని పట్ల నిబద్ధత, సంతృప్తి ఉన్నట్లు కొందరు చెప్పినప్పటికీ.. మరోవైపు వారి ఉత్పాదకత తగ్గడం, మానసిక శ్రేయస్సు దెబ్బతినడం వంటి అంశాలు కనిపించాయి.
అంతేకాకుండా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలనే ఆలోచన కూడా వారిలో పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు, యువతలో జీతం లేని అదనపు పని గంటల ధోరణి మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
కార్యాలయానికి వెళ్లి పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే రిమోట్ వర్కర్లు ఎక్కువ సమయం అదనపు పనికి కేటాయిస్తున్నట్లు నివేదికలోని గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
కంపెనీలకు హెచ్చరిక..
ఈ పరిణామాలు సంస్థలకు కీలకమైన హెచ్చరికగా మారుతున్నాయి.
ఉద్యోగుల పనితీరును కేవలం వారు ఆఫీసులో ఉన్న సమయం లేదా లాగిన్లో గడిపిన గంటల ఆధారంగా అంచనా వేయడం సరైన విధానం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
జీతం లేని అదనపు పని గంటలు నిరంతరం పెరిగితే ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు వారి మానసిక, వ్యక్తిగత శ్రేయస్సుపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
దీని ఫలితంగా ఉద్యోగులు సంస్థను వీడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని నివేదిక హెచ్చరిస్తోంది.