RBI: కేంద్రానికి ఆర్బీఐ గుడ్న్యూస్.. రికార్డు స్థాయిలో మిగులు నిధులు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఈ వారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి భారీ మొత్తంలో మిగులు నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్లోబల్గా ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ, ఈ నిధులు కేంద్రానికి ఆర్థికంగా కొంత ఊపిరి పోసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్కు సంబంధించిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా,భారత్ దిగుమతి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.3 లక్షల కోట్ల (సుమారు 31.2 బిలియన్ డాలర్లు) మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసే అవకాశముంది.
వివరాలు
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉంది
గత ఏడాది ఇచ్చిన రూ.2.7లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ.దీంతో ఆర్బీఐ చరిత్రలోనే ఇది అతిపెద్ద డివిడెండ్గా నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ వారం చివర్లో ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశమై డివిడెండ్ బదిలీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విదేశీ మారక నిల్వలు,ప్రభుత్వ బాండ్లు,లిక్విడిటీ ఆపరేషన్ల ద్వారా ఆర్బీఐకి వచ్చిన ఆదాయంతో ఈ మిగులు నిధులు ఏర్పడుతున్నాయి. మాజీ బ్యాంకర్ కె.కె. గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉందన్నారు. విదేశీ మారక నిల్వలు,సంస్థాగత పెట్టుబడులు దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థికసంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని రూ.3.61లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు.
వివరాలు
ఇంకా కొనసాగుతున్న అంతర్జాతీయ ఒత్తిడులు
అయితే అంతర్జాతీయ ఒత్తిడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని గుప్తా హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరగడం భారత్ విదేశీ ఖాతాలపై ప్రభావం చూపుతోందన్నారు. గత రెండు నెలల్లో విదేశీ మారక నిల్వలు కొద్దిగా తగ్గినప్పటికీ, భారత్ పరిస్థితి ఇంకా బలంగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశానికి 10 నుంచి 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు.
వివరాలు
కేంద్రానికి కీలకంగా డివిడెండ్
ఈ సమయంలో ఆర్బీఐ నుంచి భారీ డివిడెండ్ రావడం కేంద్రానికి కీలకంగా మారింది. పెరుగుతున్న చమురు దిగుమతి ఖర్చులతో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిధులు ప్రభుత్వ అప్పుల అవసరాన్ని కొంత వరకు తగ్గించగలవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే గ్లోబల్ అస్థిరత కొనసాగితే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధిపై ప్రభావం ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు.