India GDP: మిడిల్ ఈస్ట్ ఘర్షణ కొనసాగితే భారత్కు భారీ దెబ్బ, జీడీపీ 4% వరకు తగ్గొచ్చు: మూడీస్ అనలిటిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మూడీస్ అనలిటిక్స్ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, భారత్ జీడీపీ దాదాపు 4 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. ఆసియా-పసిఫిక్లో భారత్కు భారీ ప్రభావం మూడీస్ అంచనా ప్రకారం,ఈ ప్రాంతంలో అత్యధికంగా ప్రభావితమయ్యే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తోంది. దక్షిణ కొరియా,చైనా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇంధన సరఫరాలను దెబ్బతీసి, వస్తువుల ధరలను పెంచే ప్రమాదం ఉందని తెలిపింది. భారత్ గల్ఫ్ దేశాల నుంచి భారీగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
వివరాలు
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం
ఈ దేశాలే ప్రస్తుతం ఘర్షణలో చిక్కుకోవడంతో, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్) విస్తరించడం, వినియోగం తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. "గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటం వల్ల భారత్, చైనా పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది," అని మూడీస్ అనలిటిక్స్ తన తాజా ఆసియా-పసిఫిక్ నివేదికలో పేర్కొంది. ఈ ఘర్షణ ఎక్కువకాలం కొనసాగితే, ముఖ్యంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగితే, మొత్తం ప్రాంత ఆర్థిక వృద్ధిపై గణనీయమైన ప్రభావం పడుతుందని నివేదిక హెచ్చరించింది.
వివరాలు
వృద్ధి అంచనాల్లో మందగింపు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి రేటు 2025లో 4.3 శాతం ఉండగా, 2026లో అది 4 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా. తర్వాత కూడా మరింత మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఎనర్జీ నిల్వలు తక్కువగా ఉండటం మరో సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలు వ్యూహాత్మక నిల్వలను ఎక్కువగా ఉపయోగించుకుంటే, భారత్కు ఆ అవకాశాలు పరిమితంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం ఇంధన సబ్సిడీలు, ధరల నియంత్రణ వంటి చర్యలు తీసుకుంటే తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. అయినప్పటికీ, ఇంధన ఖర్చులు దీర్ఘకాలంగా పెరిగితే ఆర్థిక కార్యకలాపాలపై ఒత్తిడి కొనసాగుతుందని మూడీస్ తెలిపింది.
వివరాలు
భారత్ వృద్ధి కొనసాగినా వేగం తగ్గే అవకాశం
ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందే దేశంగానే కొనసాగుతుందని మూడీస్ అంచనా వేసింది. 2025లో 7.8శాతం ఉన్న వృద్ధి రేటు,2026లో 7.5శాతానికి తగ్గి,2027లో దాదాపు 6.5 శాతానికి పడిపోవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, అది ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం చుట్టూ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటే మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక నిపుణులు వచ్చే ఏడాది వృద్ధి అంచనాలను తగ్గించడం ప్రారంభించారు. బ్రెంట్ క్రూడ్ ధరలు ఫిబ్రవరి 27తో పోలిస్తే సోమవారం నాటికి దాదాపు 60 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రూపాయి కూడా డాలర్తో పోలిస్తే సుమారు 2 శాతం బలహీనపడింది.