GTRI: అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నవేళ.. జీటీఆర్ఐ కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈ అంశంపై మేధో సంస్థ జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్) తాజా సమీక్షను వెల్లడించింది. ఈ చర్చల్లో భారత్ తప్పకుండా వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవాలని, ముఖ్యంగా వ్యవసాయ రంగం,జన్యుమార్పిడి పంటల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సూచించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ఇటీవల భారత్ నుంచి అత్యుత్తమ వాణిజ్య ప్రతిపాదనలు లభించాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వివరాలు
భారత ప్రతిపాదనల్లో అమెరికా అందుకున్న వాటిల్లో అత్యుత్తమమైనవి: గ్రీర్
ఈ నేపథ్యంలో జీటీఆర్ఐ స్పందిస్తూ.."యూఎస్తో జరుగుతున్న చర్చల్లో భారత్ ఎటువంటి నిర్ణయానికైనా ముందు సమతుల్యతను ప్రధానంగా పరిగణించాలి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, జీఎంవో ఉత్పత్తులపై రాయితీలు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. అమెరికా నిజంగా భాగస్వామ్యానికి కట్టుబడి ఉంటే, ముందుగా భారత ఎగుమతులపై అమల్లో ఉన్న టారిఫ్లను 50 శాతం నుండి 25 శాతానికి తగ్గించడం ద్వారా నిజమైన సహకారాన్ని చూపాలి" అని పేర్కొంది. ఇక, భారత ప్రతిపాదనల్లో అమెరికా అందుకున్న వాటిల్లో అత్యుత్తమమైనవి అంటూ గ్రీర్ చేసిన వ్యాఖ్యలు అంగీకరించడం కష్టం అని జీటీఆర్ఐ పేర్కొంది.
వివరాలు
రాబోయే తీర్పు ఈ చర్చలకు కీలక మలుపు
మలేసియా వంటి అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం తమ ముఖ్య విధానాల్లో కూడా రాజీ పడాల్సి వచ్చిందని గుర్తుచేసింది. అందువల్ల ఒప్పందం కుదుర్చుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, చర్చల్లో సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో, ట్రంప్ విధించిన సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, ఆ తీర్పు వెలువడే వరకు భారత్ ఎలాంటి భద్రతా హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిదని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. రాబోయే తీర్పు ఈ చర్చలకు కీలక మలుపు తీసుకురావచ్చని కూడా పేర్కొంది.