Inflation: బలహీన రుతుపవనాలు,యుద్ధాల ప్రభావం.. ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకునే అవకాశముందని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరగడం, ఎరువుల సరఫరాలో అంతరాయాలు, వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి. దీంతో ఆహార ఉత్పత్తి, నిల్వ, రవాణా ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఈ ప్రభావం ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులపై కనిపించవచ్చని, 2027లో మరింత స్పష్టంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
భారత్కు తక్షణ ప్రమాదం లేదన్న బజాజ్ నివేదిక
అయితే భారత్కు సంబంధించి పరిస్థితి అంతగా ఆందోళనకరంగా లేదని బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొంది.
రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జూన్ చివరి నుంచి వర్షాలు మెరుగుపడ్డాయని, జూలైలో మంచి వర్షపాతం నమోదైందని తెలిపింది.
దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది.
అయితే సమీప కాలంలో ఆహార ద్రవ్యోల్బణం మాత్రం కొంత ఎక్కువగానే కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.
వివరాలు
మళ్లీ పెరగనున్న ఆహార ధరలు
2022లో ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని పెంచడంలో ఆహార ధరలు కీలక పాత్ర పోషించాయి.
అయితే ఈ ఏడాది ఇంధన ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆహార ధరలు కొంత స్థిరంగా కొనసాగాయి.
కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదని FAO ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో తెలిపారు.
ఆయన ప్రకారం వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగిన తర్వాత అవి వినియోగదారుల ఆహార ధరల్లో ప్రతిబింబించడానికి సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.
అందువల్ల ఈ ఏడాది చివరి నుంచి ఆహార ధరలు పెరగడం ప్రారంభమై, వచ్చే ఏడాది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
వివరాలు
వ్యవసాయ రంగంపై యుద్ధాల ప్రభావం
గోధుమలు, మొక్కజొన్న, బియ్యం వంటి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరుగుతున్నప్పటికీ,అవి ఇప్పటివరకు గతంలో వచ్చిన మంచి దిగుబడుల ప్రభావాన్ని మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని,రాబోయే సాగు సీజన్లో ఉత్పత్తి తగ్గితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చని పేర్కొన్నారు.
ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలో కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
అక్కడ అంతరాయం ఏర్పడితే వ్యవసాయ రంగానికి అవసరమైన ఇంధనం, ఎరువులు, ఇతర ముడిసరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
బ్రెంట్ ముడి చమురు ధరలు పెరగడం వల్ల నీటిపారుదల, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి.
వివరాలు
వ్యవసాయ రంగంపై యుద్ధాల ప్రభావం
అలాగే ఎరువుల తయారీలో కీలకమైన సహజవాయువు ధరలు కూడా పెరిగే అవకాశముంది.
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, గ్యాస్ మౌలిక వసతులపై దాడులు జరగడంతో డీజిల్, సహజవాయువు సరఫరాలు దెబ్బతిన్నాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా రైతుల ఉత్పత్తి వ్యయాలు పెరిగి సాగు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.
యూరప్, అమెరికా, బ్రెజిల్, ఆసియా దేశాల రైతులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని టొరెరో తెలిపారు.
వివరాలు
భారత్ రుతుపవనాలపై ప్రపంచ దృష్టి
ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు, అతిపెద్ద బియ్యం ఎగుమతిదారైన భారత్లో రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమవడంతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.
సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో బియ్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే జూన్ చివరి నుంచి వర్షపాతం గణనీయంగా మెరుగుపడిందని బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ తెలిపింది.
దేశంలోని ప్రధాన జలాశయాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ఆహార ధాన్యాల నిల్వలు ప్రభుత్వ నిర్దేశిత బఫర్ స్థాయికంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉండటంతో తృణధాన్యాల ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉందని వివరించింది.
వివరాలు
భారత్ రుతుపవనాలపై ప్రపంచ దృష్టి
2026-27 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సగటున 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
దీనికి ప్రధాన కారణం తాత్కాలిక ఆహార సరఫరా ఒత్తిళ్లేనని, మౌలిక ద్రవ్యోల్బణం మాత్రం నియంత్రణలోనే ఉందని పేర్కొంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగానే కొనసాగుతోందని నివేదిక తెలిపింది.
మే నెలలో ట్రాక్టర్ల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగాయి.
వ్యవసాయ రుణాల వృద్ధి దాదాపు 15 శాతానికి చేరగా, వ్యవసాయేతర ఆదాయాలు కూడా గ్రామీణ కుటుంబాల వినియోగ వ్యయాలను నిలబెట్టాయని వెల్లడించింది.
వివరాలు
భారత్ రుతుపవనాలపై ప్రపంచ దృష్టి
చరిత్రను పరిశీలిస్తే రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్న ఒక్క కారణంతో మొత్తం సీజన్ బలహీనంగా ముగియాల్సిన అవసరం లేదని నివేదిక పేర్కొంది.
జూన్ నెలలో తక్కువ వర్షాలు నమోదైనా, జూలై నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలే తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయని తెలిపింది.
వరుసగా రెండు సంవత్సరాలు వర్షాభావం ఉంటేనే వ్యవసాయం, గ్రామీణ వినియోగం, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించింది.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా వర్షపాతం మెరుగుపడితే 2026ను ఆలస్యంగా ప్రారంభమైనా కోలుకున్న రుతుపవనాల ఏడాదిగా పరిగణించే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
రైతులపై పెరుగుతున్న వ్యయభారం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ వ్యయాలు ఇప్పటికే రైతులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభమైన తొలి మూడు నెలల్లో గోధుమలు,మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గింది.
అమెరికాలో కొంతమంది రైతులు తక్కువ ఎరువులు అవసరమయ్యే సోయాబీన్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ ఎగుమతిదారుల్లో ఒకటైన ఆస్ట్రేలియాలో ఇంధనం,ఎరువుల ధరలు పెరగడం,కీలక ముడిసరుకుల లభ్యతపై అనిశ్చితి కారణంగా శీతాకాల పంట ఉత్పత్తి 21శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
అమెరికాలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అదనపు ప్రభుత్వ సహాయం లేకపోతే తొమ్మిది ప్రధాన పంటలు సాగు చేసే రైతులు 2027లో కలిపి 32బిలియన్ డాలర్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని అమెరికన్ ఫామ్ బ్యూరో ఫెడరేషన్ అంచనా వేసింది.
వివరాలు
ఎల్నినోతో మరింత ముప్పు
పరిశీలించిన అన్ని ప్రధాన పంటల్లోనూ ఎకరాకు వచ్చే ఆదాయం వ్యయాలను మించదని తెలిపింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ఎల్నినో ప్రభావం కూడా బలపడే అవకాశముందని FAO హెచ్చరించింది.
ఎల్నినో కారణంగా ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వర్షపాతం మార్పులు చోటుచేసుకుని పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
దీంతో ఆహార సరఫరాలు క్షీణించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తీవ్రమైన ఆహార భద్రత సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని తెలిపింది.
వాతావరణ మార్పులు, అధిక ఇంధన ధరలు, ఎరువులు,ఇంధన సరఫరాలో అంతరాయాలు కలిసి ప్రపంచ వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఎల్నినోతో మరింత ముప్పు
ప్రస్తుతం వస్తువుల మార్కెట్లు కొంత స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ఉత్పత్తి వ్యయాల ప్రభావం రాబోయే నెలల్లో సూపర్ మార్కెట్లలో ఆహార ధరల రూపంలో కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అయితే భారత్లో మెరుగవుతున్న వర్షపాతం, సమృద్ధిగా ఉన్న ఆహార ధాన్యాల నిల్వలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని నివేదిక పేర్కొంది.