LOADING...
Plastic Currency Notes: భారత్‌లో పాలిమర్ నోట్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిపాదన
భారత్‌లో పాలిమర్ నోట్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిపాదన

Plastic Currency Notes: భారత్‌లో పాలిమర్ నోట్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో పాటు ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన, మురికిపట్టిన నోట్లు చెలామణి నుంచి తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలిమర్ బ్యాంక్‌నోట్ల ప్రవేశంపై మళ్లీ దృష్టి సారించింది. దాదాపు పదేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రణాళికను ఇప్పుడు తిరిగి పరిశీలిస్తోంది. త్వరలో పైలట్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. రోజువారీ వినియోగంలో త్వరగా పాడయ్యే రూ.10, రూ.20 నోట్లతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వివరాలు 

పాలిమర్ నోట్లు అంటే ఏమిటి? పాలిమర్ నోట్లకి.. సాధారణ నోట్లకి ఉన్న తేడా ఏమిటి?

పాలిమర్ బ్యాంక్‌నోట్లు అంటే పత్తి ఆధారిత కాగితం బదులుగా ప్రత్యేకమైన సన్నని, వంచగలిగే ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేసే కరెన్సీ నోట్లు. ఇవి ఏటీఎం కార్డుల్లా గట్టిగా ఉండవు. సాధారణ నోట్ల మాదిరిగానే మడవవచ్చు, ఉపయోగించవచ్చు. ఈ నోట్ల ప్రధాన ప్రయోజనం ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే. మురికి, తేమ, చిరిగిపోవడం వంటి సమస్యలకు ఇవి ఎక్కువగా ప్రతిఘటిస్తాయి. దీంతో సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే చాలా కాలం చెలామణిలో ఉంటాయి. అంతేకాకుండా పారదర్శక విండోలు, ప్రత్యేక హోలోగ్రామ్‌లు, ఆధునిక భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లు తయారు చేయడం కూడా కష్టమవుతుంది.

వివరాలు 

ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ ఎందుకు ఆసక్తి చూపుతోంది?

ఇటీవల కరెన్సీ ముద్రణ వ్యయం గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లు ముద్రించేందుకు రూ.6,372.8 కోట్లు ఖర్చు కాగా, అంతకుముందు ఏడాది ఇది రూ.5,101.4 కోట్లు మాత్రమే. నోట్లకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ వ్యయం పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మురికిపట్టిన, దెబ్బతిన్న నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024-25లో దాదాపు 23.8 బిలియన్ నోట్లు చెలామణి నుంచి తొలగించగా, గత ఏడాది ఇది 21.24 బిలియన్ మాత్రమే. వీటిలో రూ.500 నోట్లు అత్యధికంగా ఉండగా, తర్వాతి స్థానంలో రూ.100 నోట్లు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

దేశంలో నగదు వినియోగం ఇంకా పెరుగుతూనే ఉంది

డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్నప్పటికీ నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు. మే 15 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.42.86లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.5శాతం ఎక్కువ. నగదు అవసరం ఇంకా బలంగానే కొనసాగుతున్న సంకేతంగా దీన్ని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పాలిమర్ నోట్ల ఆలోచన భారత్‌కు కొత్తది కాదు.2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.10విలువైన ఒక బిలియన్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొచ్చి, మైసూరు, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా నగరాలను ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఏటీఎంలు ఈ నోట్లను సరిగ్గా గుర్తించలేకపోవడం,నిర్వహణలో ఇబ్బందులు రావడం వల్ల ఆ ప్రాజెక్టును నిలిపివేశారు.

Advertisement

వివరాలు 

ప్లాస్టిక్ నోట్లు వాడుతున్న దేశాలు ఇవే..

ప్రస్తుతం ఆ సమస్యలకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని, ఏటీఎంలు పాలిమర్ నోట్లను సులభంగా నిర్వహించే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని పూర్తిగా లేదా పాక్షికంగా అమలు చేస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ 10 డాలర్ల నోటును విడుదల చేసింది. అనంతరం కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, రొమేనియా, న్యూజిలాండ్, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. ఈ దేశాలు పాలిమర్ నోట్ల వల్ల ఎక్కువ మన్నిక, తక్కువ భర్తీ ఖర్చు, మెరుగైన భద్రత లభిస్తోందని చెబుతున్నాయి.

వివరాలు 

అన్ని కాగితపు నోట్లు ప్లాస్టిక్‌గా మారిపోతాయా?

ప్రస్తుతం ఆ దశలో నిర్ణయం లేదు. మొదట పైలట్ ప్రాజెక్టు నిర్వహించి ఫలితాలను పరిశీలించిన తర్వాతే పెద్ద ఎత్తున అమలు చేయాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.10, రూ.20 వంటి తక్కువ విలువ కలిగిన నోట్లు ఈ ప్రయోగానికి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల ఆదరణ, నిర్వహణ సౌలభ్యం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. నోట్ల తయారీ వ్యయాన్ని తగ్గించడం, చెలామణిలో ఉన్న నోట్ల జీవితకాలాన్ని పెంచడం అనే ద్వంద్వ లక్ష్యాలతోనే ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement