Loading...
India-UK Trade Deal Kicks In: భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమలు.. ఏ వస్తువులు చౌక? ఎవరికి ఎక్కువ లాభం?
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమలు.. ఏ వస్తువులు చౌక? ఎవరికి ఎక్కువ లాభం?

India-UK Trade Deal Kicks In: భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమలు.. ఏ వస్తువులు చౌక? ఎవరికి ఎక్కువ లాభం?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన యూకే మార్కెట్ భారత ఎగుమతిదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, భారత వినియోగదారులకు కొన్ని ప్రీమియం బ్రిటిష్ ఉత్పత్తులు దశలవారీగా తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా పెట్టుబడులు పెరగడం, ఉద్యోగాల కల్పన, తయారీతో పాటు సేవల రంగానికి కొత్త ఊపు లభిస్తుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందంలో భారత ఎగుమతిదారులకే అత్యధిక ప్రయోజనం దక్కనుంది. యూకేకు భారత్ ఎగుమతి చేసే వస్తువుల్లో దాదాపు 99 శాతం ఉత్పత్తులకు సుంక రహిత ప్రవేశం లభించనుంది.

వివరాలు 

శ్రామిక ఆధారిత పరిశ్రమలకు పెద్ద ఎత్తున లాభం

ఇప్పటివరకు బ్రిటన్‌లో దిగుమతి సుంకాలు చెల్లించాల్సిన వేలాది భారత ఉత్పత్తులు ఇకపై సుంకం లేకుండా మార్కెట్లోకి వెళ్లనున్నాయి.

దీంతో యూరప్, చైనా తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ చేసే సామర్థ్యం భారత కంపెనీలకు మరింత పెరగనుంది.

ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా శ్రామిక ఆధారిత పరిశ్రమలకు పెద్ద ఎత్తున లాభం కలగనుంది.

వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రత్నాలు-నగలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, ప్రాసెస్డ్ ఫుడ్, రసాయనాలు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ఉత్పత్తి పెరగడంతో పాటు తయారీ రంగంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

భారత్ దిగుమతుల్లో యూకే వాటా తక్కువ

వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, యూకే ఇప్పటికే భారతదేశానికి ఐదో అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం.

అయితే భారత్ దిగుమతుల్లో యూకే వాటా ఇంకా చాలా తక్కువగా ఉంది.

ఈ ఒప్పందంతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత సమతుల్యంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.

ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(MSMEs)కొత్త మార్కెట్లలో అవకాశాలు పొందనున్నాయి.

ఈ ఒప్పందం వస్తువుల వాణిజ్యానికే పరిమితం కాలేదు. సేవల రంగానికీ పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది.

భారత ఐటీ సంస్థలు,కన్సల్టింగ్ కంపెనీలు,ఇంజినీర్లు,ఆర్కిటెక్టులు,అకౌంటెంట్లు,వైద్య సేవల నిపుణులు,విద్యా సేవల సంస్థలకు యూకేలో వ్యాపార అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

మొత్తం 137సేవల ఉపరంగాలను ఈ ఒప్పందం కవర్ చేస్తోంది. దీంతో భారత సేవల రంగానికి ఇది కీలక ఒప్పందంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (

ఇంకో ముఖ్యమైన అంశం డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC).

దీని ప్రకారం ఐదేళ్ల వరకు తాత్కాలికంగా యూకేలో పనిచేసే భారతీయ నిపుణులు ఇకపై రెండు దేశాల్లో సామాజిక భద్రత నిధులకు ఒకేసారి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు.

దీనివల్ల ఉద్యోగులు, కంపెనీలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు విదేశాల్లో భారత సంస్థల పోటీతత్వం కూడా పెరుగుతుంది.

భారత వినియోగదారులకు కూడా ఈ ఒప్పందం వల్ల కొన్ని ప్రయోజనాలు కనిపించనున్నాయి.

స్కాచ్ విస్కీ,జిన్,ప్రీమియం బ్రిటిష్ కార్లు,లగ్జరీ మోటార్‌సైకిళ్లు,కాస్మెటిక్స్,చాక్లెట్లు, బిస్కెట్లు,కొన్ని వైద్య పరికరాలు, ఎంపిక చేసిన ఆహార ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు దశలవారీగా తగ్గనున్నాయి.

అయితే ఈ తగ్గింపు ఒక్కసారిగా అమల్లోకి రాదు. కొన్ని ఉత్పత్తులపై కోటా విధానంలో, మరికొన్నింటిపై సంవత్సరాల వ్యవధిలో సుంకాలు తగ్గించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భారత ఎగుమతుల విస్తరణలో అసలు బలం

ప్రస్తుతం బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై 110శాతం వరకు దిగుమతి సుంకం ఉండటంతో వాటి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

కొత్త ఒప్పందం ప్రకారం అర్హత కలిగిన వాహనాలపై నిర్ణీత కోటా పరిధిలో సుంకాలను క్రమంగా తగ్గించనున్నారు.

అయితే దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ,ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు కూడా అమలు చేయనుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం అసలు బలం చౌకైన దిగుమతుల్లో కాదు, భారత ఎగుమతుల విస్తరణలో ఉంది.

ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన యూకే మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు మరింత అవకాశాలు లభించనున్నాయి.

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత ఎగుమతులను విస్తరించడానికి ఇదికీలకంగా మారనుంది.

వివరాలు 

2030 నాటికి భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 120 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం

అలాగే తయారీ, ఆర్థిక సేవలు, పునరుత్పాదక ఇంధనం, విద్య, సాంకేతిక రంగాల్లో యూకే పెట్టుబడులు కూడా పెరిగే అవకాశముంది.

పరిశ్రమల సంఘం అసోచామ్ అంచనా ప్రకారం,ఈ ఒప్పందంతో 2030 నాటికి భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 120 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

వస్త్రాలు,తోలు ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు-నగలు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయన రంగాలు భారత్‌కు ఎక్కువ ప్రయోజనం పొందనున్నాయి.

మరోవైపు ఆటోమొబైల్, పానీయాలు, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగాల్లో యూకేకు లాభాలు దక్కనున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని "చారిత్రాత్మక మైలురాయి"గా అభివర్ణించారు.

రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఇది కొత్త అవకాశాలు కల్పిస్తుందని, అభివృద్ధి చెందిన భారత్-2047 లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

వివరాలు 

విశ్లేషకులు అంచనా

మొత్తంగా చూస్తే ఈ ఒప్పందం ప్రభావం ఒక్కరోజులో కనిపించకపోయినా, రాబోయే సంవత్సరాల్లో ఎగుమతులు పెరగడం, కొత్త పెట్టుబడులు రావడం, తయారీ రంగం బలోపేతం కావడం, ఉద్యోగాల కల్పనతో భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన మేలు చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT