India-US Trade Deal: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుంచి కీలక చర్చలు స్టార్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా-అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(India-US Trade Deal)చర్చలు డిసెంబర్ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ రౌండ్లో మొదటి విడత ఒప్పందంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ సమావేశాలు దిల్లీలో నిర్వహించనున్నారు. అమెరికా తరఫున హాజరయ్యే బృందానికి యూఎస్ డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ నాయకత్వం వహించనున్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరపడం ఇది రెండోసారి. చివరిసారి అమెరికా ప్రతినిధులు సెప్టెంబర్ 16న భారత్ను సందర్శించారు. అనంతరం సెప్టెంబర్ 22న వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బృందం అమెరికాకు వెళ్లింది.
Details
2025 డిసెంబర్ నాటికి అన్ని వాణిజ్య చర్చలు పూర్తి చేయాలి
ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే అమెరికాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందని, అందులో భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరేలా సుంకాల అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటామని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల వెల్లడించారు. టారిఫ్ల సమస్యను పరిష్కరించే ఒక విడత చర్చలతో పాటు, పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడతను కూడా చేపట్టాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి అన్ని వాణిజ్య చర్చలను పూర్తి చేయాలని భారత్-అమెరికాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటివరకు మొత్తం ఆరు విడతల చర్చలు జరగగా, ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 191 బిలియన్ డాలర్లు. ఈ వాణిజ్య పరిమాణాన్ని 2030నాటికి 500బిలియన్ డాలర్లకు పెంచాలనే ఉద్దేశ్యంతో ఇరు ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి.