Stock Market: లాభాల స్వీకరణతో ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
బుధవారం భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభ ట్రేడింగ్లో లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలోని షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.75 వద్ద బలపడడం మార్కెట్కు కొంత మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
వివరాలు
ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్
గత ట్రేడింగ్ సెషన్లో 77,654 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్గా ప్రారంభమైంది.
అనంతరం స్వల్ప నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, కొద్ది సేపటికే మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చింది.
ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్లు పెరిగి 77,686 వద్ద కొనసాగింది.
ఇక నిఫ్టీ కూడా ఇదే ధోరణిని కొనసాగించింది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, అనంతరం కోలుకుని 20 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ట్రేడవుతోంది.
షేర్ల వారీగా చూస్తే హీరో మోటోకార్ప్, విప్రో, పెర్సిస్టెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం మిశ్రమ ధోరణి
మరోవైపు కేపీఐటీ టెక్నాలజీస్, వారీ ఎనర్జీస్, డాబర్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ప్రీమియర్ ఎనర్జీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.
బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా 152 పాయింట్లు క్షీణించి ట్రేడవుతోంది.
దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం మిశ్రమ ధోరణి కొనసాగుతోంది.