Cash Withdrawals: దేశంలో పెరిగిన నగదు ఉపసంహరణలు.. 2017 నోట్ల రద్దు తర్వాత గరిష్ట స్థాయికి చేరిన క్యాష్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మళ్లీ నగదు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో మొదటి 15 రోజుల్లోనే సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ (CIC) రూ.61 వేల కోట్లకు పైగా పెరిగి మొత్తం రూ.42.3 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.8 శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, 2017 నోట్ల రద్దు తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఈ పెరుగుదల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా, గత ఆర్థిక సంవత్సరమంతా నగదు డిమాండ్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
నగదు వినియోగాన్ని పెంచుతున్న బంగారం,వెండి ధరలు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో లిక్విడిటీ సర్ప్లస్ డిపాజిట్లలో సుమారు 1 శాతం ఉండగా, రెండో అర్ధభాగంలో అది 0.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతోంది. అయితే ద్రవ్యోల్బణం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉండటం వల్ల నగదు సర్క్యులేషన్ కొనసాగితే లిక్విడిటీ మరింత తగ్గే అవకాశముంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్కు చెందిన అభిషేక్ ఉపాధ్యాయ్ ప్రకారం గ్రామీణ డిమాండ్, అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ఈ పరిస్థితికి కారణం కాగా, ఎస్బీఐ ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ చెప్పినట్టుగా తక్కువ వడ్డీ రేట్లు, బంగారం,వెండి ధరలు పెరగడం కూడా నగదు వినియోగాన్ని పెంచుతున్నాయి.