Viksit Bharat: 2026-27లో వృద్ధి 6.6%కు నెమ్మదించొచ్చు.. సంస్కరణలే కీలకం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశముందని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది. ఇంతకుముందు ఇదే వృద్ధిని 7.1 శాతంగా అంచనా వేసింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ఇంధన భద్రత, ఆహార భద్రత రంగాల్లో లోతైన సంస్కరణలు తప్పనిసరని పేర్కొంది. 'ఇండియా ఫార్వర్డ్' పేరుతో విడుదలైన సంయుక్త నివేదికలో ఈ విషయాలను ఎస్ అండ్ పీ గ్లోబల్, క్రిసిల్ వెల్లడించాయి. ఇంధన సరఫరాలో అంతరాయాలు,పెరుగుతున్న చమురు,వాయువు ధరలు,రూపాయి మారకం విలువలో మార్పులు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి తెలిపారు.
వివరాలు
టోకు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే శీతాకాలపు పంటలకు అవసరమైన ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే దేశం తన పోటీతత్వాన్నిపెంచే దిశగా మరిన్ని మార్పులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం వల్ల వినియోగదారులకు తక్షణ భారం లేకపోయినా,దిగుమతుల ఖర్చు పెరగడం వల్ల టోకు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంధన సరఫరాలో ఆటంకాలు వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు సమగ్ర ఇంధన నిల్వ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి భారత వృద్ధిపై ప్రభావం చూపుతున్నప్పటికీ, దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం అంతర్గత సంస్కరణలను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.
వివరాలు
2026-27లో వృద్ధి మరింత తగ్గే సూచన
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో 2026-27లో భారత వృద్ధి రేటు మరో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. చమురు, వాయువు దిగుమతులపై అధిక ఆధారపడటం వల్ల ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగవచ్చని తెలిపారు. అదే సంవత్సరం ద్రవ్యోల్బణం 2.4 శాతం పెరిగి 6.9 శాతానికి చేరే అవకాశముందని వెల్లడించారు. అయితే వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వివరాలు
భవిష్యత్ కుదుపులను తట్టుకునే స్థితిలో భారత్
మూడీస్ రేటింగ్స్ ప్రకారం 2020 తర్వాత వేగంగా పుంజుకున్న ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటం వల్ల కరెన్సీ మార్పులు, అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం పెరిగిందని తెలిపింది. పరపతి విధానాల్లో స్పష్టత, ద్రవ్యోల్బణ అంచనాల్లో స్థిరత్వం,అవసరానికి అనుగుణంగా మారకపు రేట్లను సర్దుబాటు చేసే సామర్థ్యం దేశానికి బలం ఇస్తున్నాయని పేర్కొంది. అయితే అధిక రుణ భారం, ద్రవ్యలోటు కారణంగా వరుస కుదుపుల సమయంలో ప్రతిస్పందన సామర్థ్యం కొంత పరిమితంగా ఉండొచ్చని హెచ్చరించింది.