Iran stock market : 80 రోజుల తర్వాత తెరుచుకోనున్న ఇరాన్ స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధిత యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరి 28,2026 నుంచి టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడింది. యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు భయంతో భారీగా షేర్లు అమ్మకుండా నిలువరించేందుకు, మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో యుద్ధం కారణంగా ఇంతకాలం స్టాక్ మార్కెట్ మూతపడటం అరుదైన విషయంగా భావిస్తున్నారు. మార్కెట్ను దశలవారీగా తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. షేర్లు, ఈక్విటీ ఫండ్లు,డెరివేటివ్ ట్రేడింగ్ను మళ్లీ ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ట్రేడింగ్ జరగనుంది.
వివరాలు
టెడ్పిక్స్ సూచీ 45 లక్షల పాయింట్ల రికార్డు
యుద్ధ సమయంలో నష్టపోయిన కంపెనీలు తమ ఆర్థిక వివరాలు వెల్లడించేందుకు అదనంగా మరో గంట ట్రేడింగ్ సమయాన్ని కూడా పెంచారు. ఈ యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆంక్షలతో గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థకు దూరంగా ఉన్న టెహ్రాన్ స్టాక్ మార్కెట్, యుద్ధం కారణంగా మరింత ఒంటరైంది. 2026 ప్రారంభంలో టెడ్పిక్స్ సూచీ 45 లక్షల పాయింట్ల రికార్డు స్థాయికి చేరగా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు, ఇంటర్నెట్ షట్డౌన్లతో మార్కెట్ కుదేలైంది. మార్కెట్ను ఎందుకు మూసివేశారనే అంశంపై ఇరాన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్ స్పందించింది. యుద్ధ భయాందోళనలతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షేర్లు అమ్మే ప్రమాదం ఉండటంతో మార్కెట్ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపింది.
వివరాలు
దెబ్బతిన్న పలు కంపెనీల కార్యకలాపాలు
దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెట్టుబడిదారుల పొదుపులను కాపాడగలిగామని అధికారులు పేర్కొన్నారు. యుద్ధ సమయంలో టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖోమ్ వంటి నగరాల్లో క్షిపణి దాడులు చోటుచేసుకున్నాయి. పెట్రోకెమికల్స్, స్టీల్, మైనింగ్ రంగాలకు చెందిన పలు కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్లపై ఆంక్షలు విధించడంతో సాధారణ ట్రేడింగ్ నిర్వహించడం కష్టమైందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
తీవ్ర ఒత్తిడిలో ప్రపంచ చమురు మార్కెట్లు
ఇక ఇరాన్ స్టాక్ మార్కెట్ తిరిగి ప్రారంభమవుతున్న వేళ ప్రపంచ చమురు మార్కెట్లు కూడా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మార్గం ద్వారా ప్రపంచ పెట్రోలియం వినియోగంలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుండటంతో, అక్కడి పరిస్థితులు మరింత విషమిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.