LOADING...
IT Department: 'ఐటీఆర్‌ హోల్డ్‌' సందేశాలపై.. పన్నుదారుల్లో గందరగోళం
'ఐటీఆర్‌ హోల్డ్‌' సందేశాలపై.. పన్నుదారుల్లో గందరగోళం

IT Department: 'ఐటీఆర్‌ హోల్డ్‌' సందేశాలపై.. పన్నుదారుల్లో గందరగోళం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను చెల్లింపుదారులలో గందరగోళం నెలకొంది. ఇటీవల ఆదాయపు పన్ను విభాగం నుంచి అందుతున్న సందేశాల కారణంగా పన్ను రిఫండ్లను హోల్డ్‌లో ఉంచడం గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో కూడా వినిపిస్తూ, పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టతను ఇచ్చింది ఆదాయపు పన్ను విభాగం. ఐటీఆర్ ఫైలింగ్‌లో పొరపాట్లు జరిగే అవకాశం ఉండటం, అలాగే పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను స్వచ్ఛందంగా సమీక్షించుకోవాలని ఉద్దేశం వల్లనే ఈ అలర్ట్‌లు పంపినట్టు విభాగం తెలిపింది.

వివరాలు 

మీ రిఫండ్ మీ ఖాతాలో క్రెడిట్‌ అయ్యింది

ఇటీవల ఆదాయపు పన్ను విభాగం పెద్ద ఎత్తున పన్ను చెల్లింపుదారులకు సందేశాలు పంపింది. రిఫండ్ క్లెయిమ్స్‌లో వ్యత్యాసాల కారణంగా ఐటీ రిఫండ్‌ను హోల్డ్‌లో ఉంచామని అందులో పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు రివైజ్‌డ్ రిటర్న్‌లు సమర్పించుకోవాలని సూచన కూడా వాటిలో ఉంది. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఈ సందేశం వచ్చిందని, పూర్తి వివరాలు ఇ-మెయిల్‌లో అందించినట్టు తెలిపారు. కానీ కొంతమంది యూజర్లకు అలాంటి ఇ-మెయిల్ రాలేదని, పోర్టల్‌లో 'మీ రిఫండ్ మీ ఖాతాలో క్రెడిట్‌ అయ్యింది' అని చూపిస్తోంది అని రాసుకొచ్చారు.

వివరాలు 

2025 డిసెంబరు 31లోగా సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేసుకోవచ్చు 

పన్ను చెల్లింపుదారుల్లో కలిగిన ఈ గందరగోళం నేపథ్యంలో ఆదాయపు పన్ను విభాగం వివరణ ఇచ్చింది. నడ్జ్ (NUDGE) క్యాంపెయిన్‌ భాగంగా ఈ సందేశాలు పంపినట్టు తెలిపింది. కొందరు అర్హత లేకుండా తప్పుడు మినహాయింపులు చూపించి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకున్నారని గుర్తించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంతో, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లలో పేర్కొన్న మినహాయింపులను స్వచ్ఛందంగా సమీక్షించి సరిచూడాలని ఉద్దేశ్యం ఈ సందేశాల వల్ల అని విభాగం స్పష్టం చేసింది. అవసరమైతే 2025 డిసెంబరు 31లోపు సవరించిన రిటర్న్‌లు సమర్పించుకోవచ్చని, మినహాయింపులు సరిగా ఉంటే ఎటువంటి అదనపు చర్యలు అవసరం లేదని వెల్లడించింది.

Advertisement