iyO v/s OpenAI: ఓపెన్ఏఐ,iyO మధ్య రాజీ చర్చలు.. కోర్టు విచారణకు 7 రోజుల బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్ఏఐ,iyOతో పాటు ప్రముఖ డిజైనర్ జోనీ ఐవ్కు సంబంధించిన హార్డ్వేర్ సంస్థపై దాఖలు చేసిన ట్రేడ్మార్క్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు పక్షాలు రాజీ ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్ననేపథ్యంలో కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సంయుక్తంగా కోర్టును కోరాయి. ఈ అభ్యర్థనకు న్యాయమూర్తి ట్రినా ఎల్.థాంప్సన్ ఆమోదం తెలిపారు. కోర్టు పత్రాల ప్రకారం,ఈ కేసులో ఇరు పక్షాలు సూత్రప్రాయంగా రాజీకి అంగీకరించాయి. OpenAI,జోనీ ఐవ్ స్థాపించిన io Products స్టార్టప్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ వివాదం మొదలైంది. కొత్త AI పరికరాల అభివృద్ధి కోసం జరిగిన ఈ కొనుగోలు నేపథ్యంలో, తమ ట్రేడ్మార్క్ హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ iyO కేసు దాఖలు చేసింది.
వివరాలు
విచారణకు ఏడు రోజుల విరామానికి న్యాయమూర్తి అనుమతి
తర్వాత ఫిర్యాదులో మార్పులు చేసి, వ్యాపార రహస్యాల (ట్రేడ్ సీక్రెట్స్) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలనూ చేర్చింది.
io Products సహ-వ్యవస్థాపకుడు ట్యాంగ్ టాన్, iyO మాజీ అధికారి ద్వారా సంస్థకు చెందిన గోప్యమైన సాంకేతిక సమాచారం, ఉత్పత్తి డిజైన్ వివరాలను సేకరించారని iyO ఆరోపించింది.
ఓపెన్ఏఐ దాఖలు చేసిన పిటిషన్పై, iyO సవరించిన ఫిర్యాదును కొట్టివేయాలా లేదా రద్దు చేయాలా అనే అంశంపై విచారణ బుధవారం జరగాల్సి ఉంది.
అయితే అంతకుముందు రోజు ఇరు పక్షాలు కోర్టుకు సంయుక్తంగా సమాచారం అందిస్తూ, సూత్రప్రాయ రాజీకి చేరుకున్నట్లు తెలిపాయి.
రాజీ ఒప్పందానికి సంబంధించిన తుది నిబంధనలను పూర్తి చేసుకునేందుకు ఏడు రోజుల పాటు కేసు విచారణ నిలిపివేయాలని కూడా కోర్టును కోరాయి.
వివరాలు
సెప్టెంబర్ 8కు వాయిదా పడిన విచారణ
దీనికి న్యాయమూర్తి ట్రినా థాంప్సన్ ఆమోదం తెలుపుతూ,ఆగస్టు 6లోపు కేసును అధికారికంగా ఉపసంహరించుకునే విజ్ఞప్తి దాఖలు చేయాలని, లేదా రాజీ పూర్తికాకపోతే సంయుక్త స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
బుధవారం జరగాల్సిన విచారణను ఇప్పుడు సెప్టెంబర్ 8కు వాయిదా వేశారు.
అదే రోజున OpenAI, జోనీ ఐవ్ హార్డ్వేర్ సంస్థ "io" పేరును ఉపయోగించకుండా విధించిన తాత్కాలిక నిషేధాజ్ఞను సవరించాలన్న లేదా ఎత్తివేయాలన్న అభ్యర్థనపై కూడా విచారణ జరగనుంది.
ఇరు పక్షాలు కోర్టుకు సమర్పించిన సంయుక్త నోటీసు ప్రకారం, ప్రస్తుతం రాజీ ఒప్పందంలోని తుది నిబంధనలను అధికారిక రూపంలో సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయి.
త్వరలోనే ఆ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.