LOADING...
Jio Ipo: జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధం.. మేలో ముసాయిదా పత్రాలు
జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధం.. మేలో ముసాయిదా పత్రాలు

Jio Ipo: జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధం.. మేలో ముసాయిదా పత్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్‌ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ముసాయిదా పత్రాలను మే నెలలో మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ఇందులో చేర్చే అవకాశమున్నట్లు సమాచారం. మొదటగా ఈ పత్రాలను మార్చి నెలాఖరుకల్లా సమర్పించాలని భావించారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక గణాంకాల ఆధారంగా ముందుకు వెళ్లాలని యోచించారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం, మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలు వాయిదా పడ్డాయి.

వివరాలు 

పబ్లిక్‌ ఇష్యూను నిర్వహించేందుకు 19 బ్యాంకులు 

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌ రూపంలో మరో సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు రావడం విశేషం. ఇది దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ విలువను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు సుమారు 170 బిలియన్‌ డాలర్లుగా, అంటే దాదాపు రూ.15.78 లక్షల కోట్లుగా అంచనా వేశారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కేవలం 2.5 శాతం వాటాను విక్రయించినా దాదాపు రూ.40,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశముందని అంచనా. ఈ పబ్లిక్‌ ఇష్యూను నిర్వహించేందుకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, మోర్గాన్‌ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్‌ వంటి 19 బ్యాంకులను ఇప్పటికే రిలయన్స్‌ నియమించుకుంది.

Advertisement