Loading...
stock market: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్‌.. స్వల్ప లాభాలతో ముగింపు
లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్‌.. స్వల్ప లాభాలతో ముగింపు

stock market: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్‌.. స్వల్ప లాభాలతో ముగింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో పీఎస్‌యూ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు రియాల్టీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐటీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో సూచీలు రోజంతా స్వల్ప లాభనష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్‌ ఉదయం 78,501.59పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రితం ముగింపు 78,499.17 పాయింట్లతో పోలిస్తే ఇది స్వల్ప లాభం. ఇంట్రాడేలో ఒక దశలో 78,676.98 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. మరో దశలో 78,298.92పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.

వివరాలు

లాభపడిన షేర్లు

చివరకు 43.27 పాయింట్లు లాభపడి 78,542.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13.15 పాయింట్లు పెరిగి 24,583.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.31 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌-30లో టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

నష్టాల్లో..

మరోవైపు ఎస్‌బీఐ, ఎటర్నల్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.

పెరిగిన ముడి చమురు ధర

పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 84.33డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 4,340.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT