Stock Market: మూడో రోజు కూడా లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాట పట్టాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా మెటల్ రంగం, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో వచ్చిన కొనుగోళ్లు మార్కెట్కు బలం చేకూర్చాయి. ఫలితంగా సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగియగా, నిఫ్టీ 25,800 స్థాయికి పైగా నిలకడగా ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 83,553.59 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,450.96) లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67 డాలర్లు
కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారింది. ఇంట్రాడేలో 83,163.62 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన తర్వాత మళ్లీ కోలుకొని లాభాల దిశగా కదిలింది. చివరికి 283.29 పాయింట్లు పెరిగి 83,734.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.95 పాయింట్ల లాభంతో 25,819.35 స్థాయిలో ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.66గా నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాలు సాధించాయి. మరోవైపు ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,922 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.