Stock Market: నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల ప్రభావంతో సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్న సూచీలు నేటి ట్రేడింగ్లో తిరిగి కోలుకున్నాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్కు ఊతమిచ్చింది. అదేవిధంగా యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో ప్రీ-ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ సుమారు 800 పాయింట్లు ఎగబాకింది.
Details
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93
ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంతో 77,888 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 24,119 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Details
స్పైస్జెట్ షేర్లు సుమారు 8 శాతం పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం ఒక బ్యారెల్కు 119 డాలర్ల వరకు పెరిగినప్పటికీ, ప్రస్తుతం అది 89 డాలర్లకు తగ్గింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పైస్జెట్ షేర్లు సుమారు 8 శాతం వరకు పెరిగాయి. ఇక ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో మదుపరులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలమైన పునాదులు మార్కెట్లో వచ్చే ఊగిసలాటలను ఎదుర్కొనేందుకు సహాయపడతాయని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.