Microsoft: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో తన నాలుగో క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. 'ఇండియా సౌత్ సెంట్రల్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త క్లౌడ్ కేంద్రం ద్వారా దేశీయ సంస్థలు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను స్థానిక డేటా కేంద్రాల నుంచే మరింత వేగంగా, సురక్షితంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని కంపెనీ గురువారం వెల్లడించింది. ఇప్పటికే ముంబయి (పశ్చిమ భారత్), పుణె (మధ్య భారత్), చెన్నై (దక్షిణ భారత్) నగరాల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో నాలుగో కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా దేశంలో అత్యంత విస్తృతమైన హైపర్స్కేల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను కలిగిన అంతర్జాతీయ సంస్థగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.
వివరాలు
రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడితో అధునాతన క్లౌడ్ మౌలిక సదుపాయాలు
భారత్లో డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల అభివృద్ధి కోసం ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్ల) పెట్టుబడి ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్ క్లౌడ్ రీజియన్ను నిర్మించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ క్లౌడ్ కేంద్రంలో మూడు అవైలబిలిటీ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు ఉపయోగించే కీలక అప్లికేషన్లు ఎలాంటి అంతరాయం లేకుండా, అధిక వేగంతో పనిచేసేలా ఈ మౌలిక సదుపాయాలు సహాయపడతాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, 2030 నాటికి వాటర్ పాజిటివ్ కంపెనీగా మారాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ డేటా కేంద్రంలో నీటిని వినియోగించని నెక్స్ట్ జనరేషన్ జీరో వాటర్ కూలింగ్ సాంకేతికతను అమలు చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
వివరాలు
ఏఐ లక్ష్యాలకు బలం.. తొలి రోజే ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
భారత్ను ఏఐ ఆధారిత దేశంగా తీర్చిదిద్దడం అంటే కేవలం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వం వహించేలా అవసరమైన సామర్థ్యం, డేటా భద్రత, సాంకేతిక నైపుణ్యాలను అందించడమే తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.
హైదరాబాద్ క్లౌడ్ రీజియన్ ప్రారంభమైన తొలి రోజే అదానీ గ్రూప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పీబీ పే వంటి ప్రముఖ సంస్థలు తమ కీలక ఐటీ అప్లికేషన్ల నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను వినియోగించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.