LOADING...
Milk,pulses,vegetables: పాల నుంచి కూరగాయల వరకు.. వర్షాభావం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది?
పాల నుంచి కూరగాయల వరకు.. వర్షాభావం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది?

Milk,pulses,vegetables: పాల నుంచి కూరగాయల వరకు.. వర్షాభావం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రజల కిరాణా ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలు,పప్పుధాన్యాలు,నూనెగింజలు, కూరగాయల ధరలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పశుగ్రాసం కొరత,సాగు విస్తీర్ణం తగ్గడం,సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వంటి కారణాలతో ఆహార వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. డెయిరీ రంగ ప్రతినిధుల సమాచారం ప్రకారం ఇప్పటికే పాల ధరలు సుమారు 2నుంచి 3శాతం వరకు పెరిగాయి. పాల ఉత్పత్తి అధికంగా జరిగే ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా కొనసాగితే జూలై లేదా ఆగస్టు నాటికి మరో 3నుంచి 4 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

వివరాలు 

మే నెల పాల ధరలను పెంచిన పలు డెయిరీ సంస్థలు

ఇప్పటికే మే నెలలో అమూల్,మదర్ డెయిరీతో పాటు పలు డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. పశువుల మేత,ఇంధనం,ప్యాకేజింగ్ ఖర్చులు,పాల సేకరణ వ్యయం పెరగడమే దీనికి కారణమని సంస్థలు తెలిపాయి. ఇప్పుడు బలహీన రుతుపవనాల కారణంగా పశుగ్రాసం,నీటి లభ్యత తగ్గితే పాల ఉత్పత్తి మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉందని డెయిరీ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాఖ తెలిపింది.

వివరాలు 

వర్షాలు తగ్గితే పశువుల మేత ఖర్చు పెరగడంతో రైతులు అదనపు వ్యయం భరించాలి 

జూన్ నెలలో కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే అంచనా వేసింది. పాల ఉత్పత్తి నేరుగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది.పశువులకు అవసరమైన పచ్చిమేత, పంట అవశేషాలు,తాగునీరు సమృద్ధిగా లభిస్తేనే పాల దిగుబడి మెరుగ్గా ఉంటుంది. వర్షాలు తగ్గితే పశువుల మేత ఖర్చు పెరగడంతో రైతులు అదనపు వ్యయం భరించాల్సి వస్తుంది. కొందరు పశువుల సంఖ్యను కూడా తగ్గించే పరిస్థితి ఏర్పడవచ్చని డెయిరీ రంగ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం పాల ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది.పాలతో పాటు పెరుగు,పనీర్,వెన్న,నెయ్యి,చీజ్ వంటి పాల ఉత్పత్తుల తయారీ ఖర్చులు కూడా పెరగవచ్చు. అయితే ధరల పెంపు ఆయా కంపెనీల వ్యయభారం,మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

వివరాలు 

దేశంలో ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్న సంకేతాలు

ఇక దేశంలో ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతానికి చేరింది. వ్యవసాయ రంగంలో కూడా పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. జూన్ 25 నాటికి వేసవి పంటల సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే దాదాపు 23 శాతం తగ్గింది. ఆలస్యంగా ప్రారంభమైన రుతుపవనాలు, తక్కువ వర్షపాతం కారణంగా వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగు వెనుకబడినట్లు నివేదికలు వెల్లడించాయి. జూన్ 1 నుంచి నమోదైన వర్షపాతం కూడా సాధారణం కంటే 42 శాతం తక్కువగా ఉంది.

Advertisement

వివరాలు 

జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాల పనితీరు అత్యంత కీలకం

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. బలహీన రుతుపవనాల ప్రభావానికి గురయ్యే 300కు పైగా జిల్లాల కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది. వర్షాధార ప్రాంతాల్లో రైతులు తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగు వైపు మళ్లాలని రాష్ట్రాలకు సూచించింది. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో రుతుపవనాల పనితీరు అత్యంత కీలకం. ఈ రెండు నెలల్లో మంచి వర్షాలు కురిస్తే ఆహార ధరలపై ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఎల్‌నినో ప్రభావం పెరిగితే వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

వివరాలు 

పప్పుధాన్యాలకు సమయానికి వర్షాలు పడటం అత్యంత అవసరం

శీతాకాలం కూడా సాధారణం కంటే వేడిగా ఉంటే రబీ పంటలపై కూడా ప్రభావం పడవచ్చని హెచ్చరిస్తున్నారు. వర్షాధారంగా సాగు చేసే కందులు, నూనెగింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు తక్కువ వర్షాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే పంటలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా కంది వంటి పప్పుధాన్యాలకు సమయానికి వర్షాలు పడటం అత్యంత అవసరం. అలాగే సోయాబీన్ వంటి నూనెగింజల సాగు తగ్గితే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి రావచ్చు. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా సరఫరా అంతరాయం కారణంగా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అయితే వరి, గోధుమల విషయంలో తక్షణ ప్రభావం తక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

రానున్న రెండు నెలల్లో వర్షాలు ఎలా కురుస్తాయనే దానిపైనే తుది పరిస్థితి ఆధారపడి ఉంటుంది 

సాగునీటి సౌకర్యాలు, ప్రభుత్వ నిల్వలు ఈ పంటలకు కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంది. అయినప్పటికీ రానున్న రెండు నెలల్లో వర్షాలు ఎలా కురుస్తాయనే దానిపైనే తుది పరిస్థితి ఆధారపడి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎల్‌నినో వచ్చిన ప్రతిసారి ఆహార ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని చెప్పలేం. వర్షాల పంపిణీ, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి సౌకర్యాలు, ప్రభుత్వ నిల్వలు, దిగుమతులు, స్థానిక సరఫరా పరిస్థితులు వంటి అనేక అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. గతంతో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు,సాగునీటి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ పాలు, కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే ఆహార వస్తువుల ధరలు మాత్రం స్థానిక సరఫరాపై ఎక్కువగా ఆధారపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement