Udan: రూ.29,000 కోట్లతో ఉడాన్ పథకానికి కొత్త దశ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని చిన్న పట్టణాలు, ఇప్పటివరకు విమాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా విమాన రవాణా సౌకర్యాలను విస్తరించే లక్ష్యంతో ఉడాన్ పథకానికి నూతన దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ విస్తరణ కార్యక్రమం కోసం రాబోయే పదేళ్లలో సుమారు రూ.29,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త దశలో ఇప్పటివరకు విమాన సేవలు అందని ప్రాంతాలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉడాన్ పథకం ద్వారా చేపడుతున్నట్లు తెలిపారు.
వివరాలు
విమానాశ్రయాల కోసం ఆర్థిక సాయం..
2016లో ప్రారంభమైన ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 669 విమాన మార్గాలు అమలులోకి వచ్చాయి. సవరించిన తాజా పథకం ప్రకారం రూ.12,000 కోట్ల వ్యయంతో 100 ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. అదనంగా 200 హెలిప్యాడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, ప్రాంతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను కొనసాగించనున్నారు. అలాగే చిన్న విమానాశ్రయాల నిర్వహణకు కూడా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
వివరాలు
జోధ్పుర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభం..
జోధ్పుర్ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ను ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించారు. ఇందులో బహుళ చెక్-ఇన్ కౌంటర్లు, ఆధునిక లగేజీ నిర్వహణ వ్యవస్థలు, ఏరోబ్రిడ్జ్లు, ఇతర అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.